UPI-Transactions | రోజురోజుకు ఆన్లైన్ పేమెంట్స్ పెరిగిపోతున్నాయి. యూపీఐ ఆధారిత లావాదేవీలు జనవరిలో 803 కోట్లకు చేరాయి. వాటి విలువ దాదాపు రూ.13 లక్షల కోట్లు ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. డిసెంబర్లో 782 కోట్ల లావాదేవీలు జరిగితే వాటి విలువ రూ.12.8 లక్షల కోట్లు. భారత్లో డిజిటల్ చెల్లింపులకు ఆమోదం లభించినట్లు యూపీఐ లావాదేవీలు రుజువు చేస్తున్నాయి. తద్వారా భారత్ ఎకానమీ డిజిటల్ ఫస్ట్ ఎకానమీ దిశగా నిలకడగా అడుగులేస్తున్నట్లు అర్థమవుతున్నది.
గ్రామీణ, సెమీ పట్టణ ప్రాంతాల్లోనూ డిజిటల్ పేమెంట్స్ పాపులర్ అవుతున్నాయి. త్వరితగతిన డిజిటల్ పేమెంట్స్ జరుగుతుండటంతో ప్రతి ఒక్కరూ దానికి ఆకర్షితులవుతున్నారు. యూపీఐ ద్వారా గతేడాది (2022)లో డిజిటల్ పేమెంట్స్ విలువ రూ.126 లక్షల కోట్లు. 7400 కోట్ల డిజిటల్ పేమెంట్స్ జరిగాయి. దీంతో డిజిటల్ చెల్లింపులకు విస్తృత ఆమోదం లభిస్తున్నది. డిజిటల్ చెల్లింపుల పట్ల ప్రభుత్వ ప్రోత్సాహం కూడా అందుకు కారణం.
వచ్చే ఏడాది డిసెంబర్ వరకు డిజిటల్.. యూపీఐ చెల్లింపుల పరిమితుల నిబంధన అమలును వాయిదా వేస్తున్నట్లు గతవారం ఎన్పీసీఐ వెల్లడించింది. దీంతో థర్డ్ పార్టీ డిజిటల్ పేమెంట్స్ ప్లేయర్లకు భారీ రిలీఫ్ లభించినట్లయింది. తొలుత ఎన్పీసీఐ 2021 జనవరిలో యూపీఐ మార్కెట్ క్యాప్ రూల్స్ అమలు చేయాలని ప్లాన్ చేసింది. కానీ తర్వాత పలు దఫాలు వాయిదా పడింది.