Flight Tickets | న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఈ దీపావళికి విమాన చార్జీల మోత గట్టిగానే ఉండబోతున్నది. నిరుడుతో పోల్చితే ఈసారి ప్రయాణీకులు అదనంగా 90 శాతం వరకు చెల్లించాల్సి వస్తోంది మరి. నవంబర్ 10 నుంచి 16 మధ్య టిక్కెట్ బుకింగ్స్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 మధ్య దీపావళి పండుగ సీజన్ వచ్చింది. ఈ సమయంలో ఢిల్లీ-శ్రీనగర్ రూట్ విమాన టిక్కెట్ ధర రూ.3,794గా ఉన్నది. కానీ ఈ నవంబర్ 10-16 మధ్య ఈ రూట్ విమాన ప్రయాణం రూ.7,175 పలుకుతుండటం గమనార్హం. 89.11 శాతం పెరిగినైట్టెంది. ఢిల్లీ-హైదరాబాద్, బెంగళూరు-హైదరాబాద్ విమాన చార్జీలూ 34 శాతం నుంచి 63 శాతం వరకు ఎగబాకాయి. ఫలితంగా ఈ పండుగకు విమానాల్లో వెళ్లాలనుకునేవారు పునరాలోచనలో పడుతున్నారు.
దేశంలోని మెట్రో నగరాలేగాక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విమాన చార్జీలు పెరిగాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూర్ల నుంచి భువనేశ్వర్, ఇండోర్, లక్నో, జైపూర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన చార్జీల్లో 5-15 శాతం మధ్య పెరుగుదల కనిపిస్తున్నది. కాగా, ఆయా పెద్ద నగరాల్లో పనిచేస్తున్నవారు దీపావళికి సొంత ఊర్లకు తప్పక వెళ్తారని, దీంతో ముందుగానే టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయని ట్రావెల్ ఏజెన్సీలు చెప్తున్నాయి. పని ఒత్తిడి, సెలవుల సర్దుబాట్ల మధ్య ఆయా తేదీల్లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని, ఈ క్రమంలోనే నవంబర్ 10-16 మధ్య టిక్కెట్ రేట్లు ఎగబాకాయని అంటున్నారు.
దేశీయ విమానయాన మార్గాల్లోనేగాక.. అంతర్జాతీయ రూట్లలోనూ దీపావళి ప్రభావం కనిపిస్తుండటం విశేషం. జ్యూరిచ్, ప్యారిస్, వియన్నా, మ్యాడ్రిడ్, బుడాపెస్ట్, ఏథెన్స్, సిడ్నీ, లండన్ వంటి నగరాలకు విమాన ప్రయాణం ఖరీదెక్కింది. ఈ రూట్లలో విమాన చార్జీలు 10 శాతం పుంజుకున్నాయి. ఇక దక్షిణాఫ్రికాకు గరిష్ఠంగా టిక్కెట్ ధరల్లో 17 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. కాగా, సుదూర ప్రాంతాల కంటే, దగ్గరి విదేశీ ప్రయాణాల చార్జీల్లోనే పెరుగుదల ఎక్కువగా ఉంటుందని ట్రావెల్ ఏజెంట్లు చెప్తున్నారు. ఈ ఏడాది మే-జూన్తో పోల్చితే దుబాయ్, అబుదాబీ, బ్యాంకాక్, కౌలాలంపూర్, సింగపూర్ రూట్లలో చార్జీలు 15-35 శాతం పెరుగవచ్చని అంటున్నారు.
‘గత ఏడాది దీపావళి సీజన్ (అక్టోబర్ 21-27)తో చూస్తే ఈ దీపావళి సీజన్ (నవంబర్ 10-16)లో ఢిల్లీ-అహ్మదాబాద్ రూట్ విమాన చార్జీ 72 శాతం పెరిగింది. ఇక ఢిల్లీ-శ్రీనగర్ విమాన టిక్కెట్ ధరలో అత్యధికంగా 89 శాతం పెరుగుదల నమోదైంది.
-నిశాంత్ పిట్టి, ఈజీమైట్రిప్ సీఈవో
‘ఈ సెప్టెంబర్లో ట్రావెల్ డిమాండ్ గరిష్ఠ స్థాయికి వెళ్లవచ్చని మా అంచనా. పండుగ సీజన్తోపాటు, చివరి నిమిషంలో జరిగే బుకింగ్స్ చార్జీలను ఎగదోస్తున్నాయి. గో ఫస్ట్, స్పైస్జెట్ సంక్షోభాలు విమానాల కొరతకు దారితీస్తుండటమూ చార్జీల పెంపునకు కారణమవుతున్నది.
-ఇండివర్ రస్తోగి, గ్లోబల్ బిజినెస్ ట్రావెల్ గ్రూప్ అధిపతి
‘ఏటా జూన్, జూలై నెలల్లో ప్రయాణాలు తక్కువగా ఉంటాయి. అయితే అక్టోబర్ నుంచి పండుగ సీజన్ మొదలవుతుంది. దీంతో ఈ కాలంలో ప్రయాణాలు ఊపందుకుంటాయి. ఈ దీపావళికి గతంతో చూస్తే ప్రయాణీకులు పెరుగుతారని మా అంచనా.
-రజ్నీశ్ కుమార్, ఇక్సిగో సహవ్యవస్థాపకుడు