Adani | హైదరాబాద్, అక్టోబర్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు అండతో పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వే, సిమెంటు, విద్యుత్తు, రవాణా, గ్యాస్, రిటైల్, మీడియా ఇలా 30కిపైగా కీలక రంగాల్లో అదానీ గ్రూప్ పాతుకుపోయింది. కోల్ మైనింగ్లో అదానీ గ్రూప్నకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. దీన్ని ధ్రువపరుస్తూ జర్నలిస్టుల వేదిక ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. అడవుల్లో కోల్మైనింగ్ చేపట్టరాదన్న నిబంధనలను పక్కనబెట్టి బొగ్గు మంత్రిత్వ శాఖ.. అదానీ గ్రూప్నకు ఉద్దేశపూర్వకంగా ఎలా లబ్ధి చేకూర్చిందో ఆ కథనంలో లోతుగా విశ్లేషించింది.
బీజేపీ సర్కారుకు ముందుచూపు లేకపోవడంతో 2021 నవంబర్లో దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం ఏర్పడింది. దీంతో బొగ్గు సరఫరాను పెంచేందుకు మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీ కోల్ఫీల్డ్స్ (మారా 2), ఛత్తీస్గఢ్లోని హస్దేవ్ అరండో అభయారణ్య బొగ్గు బ్లాక్లకు వేలం వేయాలని ప్రైవేట్ కోల్ కంపెనీల గ్రూప్ ‘ది అసోసియేషన్ ఆఫ్ పవర్ ప్రొడ్యూసర్స్’ బొగ్గు మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాసింది. దీంతో సదరు గనులకు వేలం వేయాలని కోల్ మినిస్ట్రీ నిర్ణయించింది. అయితే ఈ వేలం.. నిబంధనలకు విరుద్ధమని పర్యావరణవేత్తలు ఆరోపించారు. 2018లో పర్యావరణ మంత్రిత్వ శాఖ 15 కోల్ బ్లాక్స్ను నిషేధిత జాబితాలో పెట్టిందని, అందులో మారా 2 కూడా ఉన్నదని తెలిపారు. ఈ క్రమంలో దీనిపై సమీక్షించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ.. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ (సీఎంపీడీఐ) నివేదికను కోరింది.
కేంద్రం ఆదేశాల మేరకు నివేదికను సమర్పించిన సీఎంపీడీఐ.. మారా 2సహా 15 బ్లాక్స్ను ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయకూడదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ కేంద్రం ఆ నివేదికను పక్కనబెట్టింది. మారా 2, హస్దేవ్ కోల్ బ్లాక్ల వేలానికి సిద్ధమైంది. అయితే హస్దేవ్ కోల్ బ్లాక్ వేలాన్ని నిలిపేయాలని ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కానీ మారా 2 కోల్ బ్లాక్ బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగింది. సింగిల్ బిడ్డర్గా మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్ ఈ కోల్ బ్లాక్ను ఈ ఏడాది జూన్లో సొంతం చేసుకొన్నది.
టెండర్ గెలిచిన మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్.. అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ కావడం గమనార్హం. అలాగే బొగ్గు బ్లాక్లను వేలం వేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిన ‘ది అసోసియేషన్ ఆఫ్ పవర్ ప్రొడ్యూసర్స్ గ్రూప్’లో అదానీ గ్రూప్ ప్రాబల్యం ఎక్కువగా ఉండటం ఆలోచించాల్సిన విషయం. పవర్ ప్రొడ్యూసర్స్ గ్రూప్ వేలం వేయాలంటూ పట్టుబట్టిన మారా 2, హస్దేవ్ కోల్ బ్లాక్స్ సమీపంలోనే అదానీకి చెందిన మరికొన్ని కోల్ బ్లాక్స్ ఉన్నాయి. మారా 2, హస్దేవ్ కోల్ బ్లాక్స్ అదానీపరమైతే, లాజిస్టిక్స్పరంగా ఆ గ్రూప్నకు పెద్ద ఎత్తున కలిసి వస్తుంది. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్.. పవర్ ప్రొడ్యూసర్స్ గ్రూప్తో కోల్ బ్లాక్లను వేలం వేయాలంటూ లాబీయింగ్ చేయించిందని, అదానీ గ్రూప్నకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే బొగ్గు మంత్రిత్వ శాఖ టెండర్ను పూర్తిచేసిందని ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ సమగ్రంగా వివరించింది.