న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: సెబీ, ఆర్బీఐ తదితరాలు చాలా అనుభవజ్ఞులని, ఆదానీ గ్రూప్ సంక్షోభానికి సంబంధించిన అంశాలను వారు నిశితంగా పరిశీలిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఇన్వెస్టర్లు దెబ్బతిన్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలకు సంబంధించి శనివారం నాడిక్కడ మీడియా సమావేశంలో ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ‘కోర్టులో ప్రభుత్వం ఏమి చెపుతుందో నేను ఇక్కడ వెల్లడించను..ఇండియా రెగ్యులేటర్లు చాలా చాలా అనుభవం కలిగినవారు. వారికి చెందిన విభాగాల్లో నిపుణులు. ఈ అంశాన్ని (అదానీ షేర్ల పతనం) వారు చూస్తున్నారు. ఇప్పుడే కాదు.
వారు ఎప్పుడైనా అప్రమత్తంగా ఉంటారు’ అని చెప్పారు. అదానీ గ్రూప్ షేర్ల కృత్రిమ పతనంతో అమాయక మదుపుదారులు దెబ్బతిన్నారంటూ దాఖలైన పిల్పై కేంద్రం, మార్కెట్ రెగ్యులేటర్ సెబీల వివరణల్ని సుప్రీంకోర్టు కోరింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు నియంత్రణాపరమైన యాంత్రాంగం ఏర్పాటుతో సహా తీసుకున్న వివిధ చర్యల గురించి తెలియచేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెగ్యులేటర్లను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఆదేశించింది. హిండెన్బర్గ్ నివేదికతో గ్రూప్ షేర్లు పతనమైనది తెలిసిందే.