న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. బ్యాంకుల ఆర్థిక పరిస్థితి, పనితీరుపై ప్రధానంగా చర్చించిన వీరు.. సైబర్ సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు అధికమయ్యాయని, వీటిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై ప్రధానంగా వీరు చర్చించినట్లు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి.
అలాగే డిపాజిట్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక స్కీంలను ప్రవేశపెట్టాలని, తద్వారా భారీ స్థాయిలో నిధులను సమీకరించుకోవాలని బ్యాంక్ల అధిపతులకు మంత్రి సూచించారు. ఇదే సమయంలో మోసాలు, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవలకాలంలో ఎస్బీఐతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 125 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.