న్యూఢిల్లీ, జనవరి 20: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మొండి బకాయిలకోసం నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో డిసెంబర్ త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.3,590 కోట్ల నికర లాభాన్ని గడించింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,249 కోట్ల కంటే ఇది 60 శాతం అధికం. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.24,154 కోట్ల నుంచి రూ.29,137 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. గత త్రైమాసికంలో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.20,883 కోట్ల నుంచి రూ.25,363 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 7.93 శాతం నుంచి 4.83 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 2.14 శాతం నుంచి 1.08 శాతానికి తగ్గాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి నిధుల కేటాయింపులు రూ.2,443 కోట్ల నుంచి రూ.1,226 కోట్లకు తగ్గాయని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.