ముంబై : కరోనా మహమ్మారి నెమ్మదించినా దేశవ్యాప్తంగా కొత్త ఉద్యోగాలు ఆశించిన స్ధాయిలో అందుబాటులోకి రావడం లేదు. జులైలో 6.96 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఆగస్ట్లో 8.32 శాతానికి ఎగబాకిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) జాబ్స్ డేటా వెల్లడించింది. మరోవైపు ఆగస్ట్లో భారత్లో 15 లక్షల కొలువులు కోల్పోయిందని పేర్కొంది.
ఈ గణాంకాలు ప్రతికూలంగా ఉన్నా ఆందోళన రేకెత్తించేవి కాదని సీఎంఐఈ ఎండీ, సీఈఓ మహేష్ వ్యాస్ పేర్కొన్నారు. జులైతో పోలిస్తే ఆయా పనుల్లో కార్మికులు నిమగ్నమయ్యే రేటు పెరిగిందని చెప్పారు. నారుమళ్ల సీజన్ ముగియడంతో ఆగస్ట్లో ఉద్యోగాలు నష్టపోయినట్టు గణాంకాలు వెల్లడించాయని తెలిపారు.
దీంతో వ్యవసాయ రంగంలో మొత్తం 80 లక్షల మంది ఉపాధి కోల్పోగా వీరిలో చాలా మంది ఇతర రంగాల్లో పనులకు కుదురుకున్నారని చెప్పారు. ఫలితంగా దెబ్బతిన్న ఉపాధి కేవలం 15 లక్షలకు పరిమితమైందని విశ్లేషించారు. ఎక్కువ మంది ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి కోసం చూస్తుండటం సానుకూల పరిణామమని వ్యాస్ పేర్కొన్నారు.