మందమర్రి, జూలై 30: గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి నష్టం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. మందమర్రి మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం సందర్శించిన ఆయన వర్షాల నేపథ్యంలో చేపడుతున్న చర్యలను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, తహసీల్దార్ సతీశ్ కుమార్కు పలు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, కాలనీలలో నీరు నిలువ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారికి కావాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. వాగులు, ఒర్రెలు, చెరువులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకు రాకుండా చూడాలని ఆయన సూచించారు. ప్రధాన నాళాలలో చేరిన చెత్తాచెదారాలను వెంట వెంటనే తొలగించి శుభ్రం చేయాలని ఆయన పేర్కొన్నారు.
జైపూర్ మండలంలో..
జైపూర్, జూలై 30: రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం లోతట్టు ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులతో కలిసి పర్యటించారు. గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టేకుమట్ల వద్ద లోలెవల్ వంతెన పైనుంచి వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. వాగు ప్రవాహం ఎక్కువ ఉండడంతో ప్రయాణికులు రాకపోకలు సాగించవద్దని సూచించారు. అదనపు కలెక్టర్ ఆదేశంలో పోలీసుల బారికెడ్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, సీఐ నవీన్కుమార్, ఎంపీవో బాపురావు తదితరులు పాల్గొన్నారు.
ముంపు ప్రాంతం పరిశీలన
హాజీపూర్, జూలై 30 : హాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని ధర్మారం గ్రామంలోని ముంపు ప్రాంతాన్ని హాజీపూర్ గ్రామ సర్పంచ్ మాధవరపు శ్రీలతా-రామారావు గురువారం సందర్శించారు. రామారావు మాట్లాడుతూ ధర్మారం చెరువు గ్రామంలోని ఇండ్లల్లోకి నీరు చేరిందని వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీరి వెంట వార్డు సభ్యులు దానయ్య తదితరులున్నారు.
వాగుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలి
నస్పూర్, జూలై 30 : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వాగులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో వాగులు, నదులు, కల్వర్టుల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టి ప్రజలు వెళ్లకుండా చూస్తున్నామన్నారు. డీసీపీ భాస్కర్, ఆయా శాఖల అధికారులున్నారు.
మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దు
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదిలో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని జిల్లా మత్య్సశాఖ అధికారి అవినాష్ ఒక ప్రకటనలో తెలిపారు. చెరువులు, కుంటల దగ్గర చేపల కోసం జాలీలు, వలలు అమరిస్తే వెంటనే వాటిని తొలగించాలన్నారు. గోదావరి, రిజర్వాయర్లలో చేపల వేట నిషేధం ఉందని మత్య్సకారులు గమనించాలని కోరారు.