న్యూఢిల్లీ : ఎడ్యుటెక్ కంపెనీ అన్అకాడమీలో లేఆఫ్స్ (Layoffs) ప్రక్రియకు తెరపడలేదు. నాలుగో దశ లేఆఫ్స్లో అన్అకాడమీ 380 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గత ఏడాది నవంబర్లో 350 మంది ఉద్యోగులను తొలగించిన అన్అకాడమీ అంతకుముందు 150 మంది ఉద్యోగులను సాగనంపింది. ఇక తాజా లేఆఫ్స్ విషయానికి వస్తే ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు అన్అకాడమీ సీఈవో గౌరవ్ ముంజల్ ఈమెయిల్ ద్వారా సమాచారం అందించినట్టు తెలిసింది.
ప్రధాన వ్యాపారాన్ని లాభాల బాట పట్టించేందుకు సరైన దిశలో అన్ని చర్యలు చేపట్టామని, అయితే ఇది సరిపోనందున కఠిన నిర్ణయాలు చేపట్టాల్సి వచ్చిందని కంపెనీ సహ వ్యవస్ధాపకులు, అన్అకాడమీ సీఈవో గౌరవ్ ముంజల్ పేర్కొన్నారు. ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని, ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.
ఇక వరుస లేఆఫ్స్తో ఏప్రిల్ 2022లో 6000 మంది ఉద్యోగుల నుంచి ప్రస్తుతం అన్అకాడమీ ఉద్యోగుల సంఖ్య 3000కు తగ్గింది. ఇక నోటీస్ పీరియడ్ వ్యవధితో పాటు అదనంగా ఒక నెల వేతనం పరిహార ప్యాకేజ్ కింద చెల్లిస్తామని ముంజల్ ఉద్యోగులకు తెలిపారు. మరో ఆరు నెలల పాటు సెప్టెంబర్ 30 వరకూ లేఆఫ్స్కు గురైన ఉద్యోగులకు మెడికల్ ఇన్సూరెన్స్ కొనసాగుతుందని చెప్పారు.
Read More
Office Chair | ఆఫీసులో కుర్చీ కోసం గొడవ.. సహోద్యోగిపై వ్యక్తి కాల్పులు