Vijay Mallya | పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్య కష్టాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నది. ప్రస్తుతం లండన్లో సొంత ఇంటిలో ఆయన ఉంటున్నారు. విజయ్ మాల్యతోపాటు ఆయన కుటుంబ సభ్యులను ఆ ఇంటి నుంచి బహిష్కరించాలని లండన్ కోర్టు ఆదేశించింది. లక్షల పౌండ్ల విలువ గల లగ్జరీ ఇండ్లో ప్రస్తుతం ఆయన నివాసం ఉన్నారు. ఈ ఇంటిని స్విస్ బ్యాంక్ యూఎస్బీ స్వాధీనం చేసుకోనున్నదని తెలుస్తున్నది.
కింగ్ ఫిషర్స్ ఎయిర్లైన్స్, యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ (యూబీఎల్), రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారాలు నిర్వహించిన విజయ్ మాల్య.. ఎస్బీఐ సారధ్యంలో బ్యాంకుల కన్సార్టియం వద్ద సుమారు రూ.9000 కోట్ల రుణాలు తీసుకున్నారు. కానీ రుణ వాయిదాలను చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
తనను అరెస్ట్ చేస్తారన్న అంచనాల మధ్య కేసు నమోదు కాకముందే దేశాన్ని వీడి.. లండన్కు చేరుకున్నారు. అయితే, ఆయన ఆస్తులు, యూబీఎల్ షేర్ల విక్రయం ద్వారా ఎస్బీఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియం రూ.5,824.5 కోట్ల రుణాలను రాబట్టుకోగలిగింది. గత జూన్ 23న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఎస్బీఐకి రూ.6,624 కోట్ల విలువైన యూబీఎల్ షేర్లను బదిలీ చేసిన తర్వాత వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (డీఆర్టీ) సదరు షేర్ల విక్రయానికి ఆదేశాలు జారీ చేసింది.