హైదరాబాద్, జనవరి 9: వ్యాపార విస్తరణలో భాగంగా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టింది. ఒకేసారి హైదరాబాద్లో ఐదు శాఖలను వచ్చేవారం ప్రారంభించబోతున్నది. మాదాపూర్, కూకట్పల్లి, ఏఎస్రావు నగర్, సికింద్రాబాద్లలో ఏర్పాటు చేసిన శాఖలతో మొత్తం శాఖల సంఖ్య 598కి చేరుకోనున్నది. బ్యాంకింగ్ సేవలను మరిన్ని రాష్ర్టాలకు విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణలో అడుగుపెట్టినట్లు, దీంతో తన వ్యాపారాన్ని 25 రాష్ర్టాలకు విస్తరించినట్లు అయిందని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఇత్తిర డేవిస్ తెలిపారు.
ఈ శాఖల్లో పొదుపు, కరెంట్ ఖాతాలతోపాటు గృహ, చిన్న సంస్థలకు రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. పొదుపు ఖాతాలపై 7.50 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్..560 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. సూక్ష్మ, చిన్నస్థాయి సంస్థలకు రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు, రూ.5 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు గృహ రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు.