న్యూఢిల్లీ : ఈ ఏడాది నవంబర్లో పలువురి ఖాతాల్లో పొరపాటున జమ చేసిన రూ. 820 కోట్లకు గాను రూ. 705.31 కోట్లను యూకో బ్యాంక్ (UCO Bank) రికవరీ చేసిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి భగవత్ కరద్ సోమవారం వెల్లడించారు. బ్యాంక్ ఐఎంపీ పేమెంట్ చానెల్లో సాంకేతిక లోపంతో 41,000 యూకో బ్యాంక్ ఖాతాల్లోకి పొరపాటున ఈ నిధుల బదిలీ జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి నవంబర్ 15న యూకో బ్యాంక్ ఇద్దరు సపోర్ట్ ఇంజనీర్లు, గుర్తించలేని ఇతర వ్యక్తులపై సీబీఐ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక పశ్చిమ బెంగాల్, కర్నాటకలోని 13 ప్రదేశాల్లో డిసెంబర్ 5న సీబీఐ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఈ మెయిల్ ఆర్కైవ్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది.
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఎదురవుతున్న సైబర్ సెక్యూరిటీ సవాళ్లపై నవంబర్ 28న కేంద్ర ఆర్ధిక శాఖ సమావేశమైంది. ఈ భేటీలో బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల సన్నద్ధత గురించి చర్చించామని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి కరద్ పేర్కొన్నారు. సైబర్ దాడులు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి అవకతవకలకు సంబంధించి దీటైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Read More :