హైదరాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ బిజినెస్): ప్రభుత్వానికి చెందిన యూకో బ్యాంక్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1,500 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సోమ శంకర ప్రసాద్ తెలిపారు. ‘ఎక్స్పోర్టర్స్ మీట్-2022’ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బ్యాంకింగ్ రంగం తిరిగి వృద్ధి బాట పట్టిందని, ఈ ఏడాది ఇప్పటివరకు అడ్వాన్స్ల్లో 17 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న బ్యాంక్..డిపాజిట్లు 10 శాతం చొప్పున పెరిగాయన్నారు. మొత్తం ఏడాదికిగాను 15 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
వడ్డీరేట్లు మరో పావు శాతం పెరగొచ్చు..
వడ్డీరేట్లు మరో పావు శాతం పెరిగే అవకాశం ఉన్నదని ప్రసాద్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెపోరేటు 6.50 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను ముట్టుకోకపోవచ్చునన్నారు.
తెలంగాణలో ఇంకో 4 శాఖలు
వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే మార్చి నాటికి దేశవ్యాప్తంగా 200 కొత్తగా శాఖలను ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. వీటిలో తెలంగాణలో నాలుగు, ఆంధ్రప్రదేశ్లో ఒక శాఖని తెలిపారు. దీంతో తెలుగు రాష్ర్టాల్లో మొత్తం శాఖల సంఖ్య 81కి చేరుకోనుండగా, అలాగే దేశవ్యాప్తంగా 3,300కి చేరుకోనున్నాయి. బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.3.50 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా, ఆర్థిక సంవత్సరం చివరినాటికి 3.70 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు.