Two Wheeler Sales | గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ద్విచక్ర వాహనాల సేల్స్ దారుణంగా పడిపోయాయి. ఏడేండ్ల కనిష్ట స్థాయి రికార్డు నమోదు చేశాయి. వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగించే ట్రాక్టర్ల విక్రయాల్లో గ్రోత్ నెమ్మదించింది. ఏడాది కాలంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ప్రభావం గ్రామీణ ప్రాంతాలపై గణనీయంగా పడినట్లు కనిపిస్తున్నదని వాహనాల విక్రయ గణాంకాలు చెబుతున్నాయి. టూ వీలర్స్ సేల్స్ ఇప్పటికీ 2019-20 స్థాయి కంటే తక్కువగా ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) పేర్కొంది.
మార్చితోపాటు గత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్లు మినహా ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ డబుల్ డిజిట్ గ్రోత్ నమోదైంది. మార్చిలో 14 శాతం, ఏడాది పొడవునా 21 శాతం గ్రోత్ నమోదైంది. మార్చిలో టూ వీలర్స్ సేల్స్ 12 శాతం, త్రీ వీలర్స్ 69 శాతం, కార్లు 14 శాతం, కమర్షియల్ వెహికల్స్ 10 శాతం పెరిగాయి. గత నెలలో ట్రాక్టర్ విక్రయాలు నాలుగు శాతం మాత్రమే వృద్ధి చెందాయి. టూ వీలర్స్ మార్చి విక్రయాలు పెరిగినా 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తొమ్మిది శాతం తక్కువేనని ఫాడా ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. 2021-22తో పోలిస్తే హీరో మోటో కార్ప్ టూ వీలర్స్ సేల్స్ 34.35 శాతం నుంచి 32.07 శాతానికి తగ్గిపోయాయి. హోండా మోటార్ సైకిల్, టీవీఎస్ మోటార్ బైక్స్, స్కూటర్ల సేల్స్ కూడా గణనీయంగా పెరిగిపోవడం గమనార్హం.
కరోనా మహమ్మారి తర్వాత రెండేండ్లకు 2022-23లో పూర్తి స్థాయిలో వాహనాల విక్రయాలు జరిగాయి. తత్ఫలితంగా గతేడాది అన్ని కేటగిరీల్లో రిటైల్ వెహికల్స్ సేల్స్ 21 శాతం వృద్ధి నమోదైందని మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. గత ఏడాది కాలంలో టూ వీలర్స్ 19 శాతం, త్రీ వీలర్స్ 84, కార్లు 23, కమర్షియల్ వెహికల్స్ 33 శాతం, ట్రాక్టర్లు ఎనిమిది శాతం సేల్స్ పెంచుకున్నాయి. పలు పండుగలు రావడంతోపాటు బీఎస్-6 రెండోదశ ప్రమాణాల అమలుతో పెరిగిన ధరల ప్రభావంతో గత నెలలో కార్ల విక్రయాలు పెరిగాయని చెప్పారు.
త్రీ వీలర్స్లో 84 శాతం వృద్ధి సాధిస్తే, విద్యుత్ వాహనాల సేల్స్ 52 శాతానికి చేరుకున్నాయి. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వెహికల్స్కు ప్రభుత్వ సబ్సిడీలు, నిధుల లభ్యతతో త్రీ వీలర్స్ సేల్స్లో స్ఫూర్తిదాయక వృద్ధి నమోదైందని మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు.