Paytm Crisis | ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ పేటీఎం సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా విజయ్శేఖర్ శర్మ పునః నియామకం వివాదంలో చిక్కుకున్నది. సంస్థ సారధిగా విజయ్శేఖర్ శర్మ నియామకానికి మూడు దేశీయ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ససేమిరా అంటున్నాయి. ఎండీ కం సీఈవోగా విజయ్శేఖర్ శర్మను పునః నియమించాలని పేటీఎం ప్రతిపాదించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆయన్ను వ్యతిరేకిస్తున్న సంస్థల్లో ఇన్స్ట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్ IiAS) స్టాక్ హోల్డర్స్ ఎంపర్మెంట్ సర్వీసెస్ (ఎస్ఈఎస్), ఇన్గవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ ఉన్నాయి. ఎండీ కం సీఈవోగా విజయ్ శేఖర్ శర్మ నియామకానికి వ్యతిరేకంగా ఓటేయాలని వాటాదారులను కోరాయి. అందుకు తాము చెబుతున్న కారణాలు విభిన్నం అని వాదిస్తున్నాయి.
డైరెక్టర్గా రొటేషన్గా రిటైర్ కావడానికి విజయ్శేఖర్ శర్మ సిద్ధంగా లేరని ఇన్గవర్న్ వాదిస్తున్నది. `రొటేషన్ ప్రకారం డైరెక్టర్గా రిటైర్ కావడానికి శర్మ సిద్ధంగా లేరు. మా దృష్టిలో ఇదే ప్రధాన సమస్య. షేర్ ధర ఆందోళనకరం. కానీ పేటీఎం ఒక్కటే కాదు. స్టాక్మార్కెట్లోకి ఎంటరైన అన్ని స్టార్టప్ సంస్థల షేర్లు ఆల్టైం రికార్డు స్థాయికి దూసుకెళ్లి పతనం అయ్యాయి. వాటిల్లో చాలా వరకు లాభదాయక కంపెనీలు కాదు. లాభసాటిగా మారడానికి ఏం చేయాలన్న విషయమై మ్యూచువల్ ఫండ్స్ & ఇన్సూరెన్స్ సంస్థలు ఇప్పటికీ తర్జనభర్జన పడుతున్నాయి. సంస్థ ఐపీవోకు వెళుతున్నప్పుడే కొంత సమాచారం తెలుసు` అని ఇన్గవర్న్ వ్యవస్థాపకుడు, ఎండీ శ్రీరామ్ సుబ్రమణ్యన్ చెప్పారు.
పేటీఎంతోపాటు జొమాటో, పాలసీ బజార్, నైకా వంటి స్టార్టప్ సంస్థలు కూడా ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన తర్వాత వాటి షేర్లు ఆల్టైం గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లి పతనం అయ్యాయి. చైర్మన్ కం ఎండీగా విజయ్శేఖర్ శర్మ మితిమీరిన రెమ్యూనరేషన్ పొందుతున్నారని ఎస్ఈఎస్ వాదిస్తున్నది. ఇక స్టాక్ మార్కెట్లలోకి ఎంటరైన తర్వాత పేటీఎం స్టాక్ విలువ పతనం కావడంపై ఐఐఎఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రొఫెషనలిజం గల యాజమాన్యాన్ని నిర్మించే అంశాన్ని పేటీఎం బోర్డు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని ఐఐఎఎస్ కోరింది. పేటీఎం ఐపీవోకు వెళ్లిన తర్వాత స్టాక్ 63.6 శాతం నష్టపోవడం గమనార్హం.