హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి రుణాలు పొంది మోసానికి పాల్పడ్డ కార్వీ స్టాక్ బ్రోకరింగ్ చైర్మన్ పార్థ సారధిని రెండు రోజుల పాటు విచారణ నిమిత్తం సీసీఎస్ పోలీసుల కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ను రూ. 137 కోట్ల మోసం చేసిన కేసులో అరస్టైన పార్థసారధి ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నాడు. దీంతో బుధవారం నిందితుడిని కస్టడీకి తీసుకొని రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎక్కడకు మళ్లించారు, ముందస్తు ఫ్లాన్తోనే ఈ మోసాలకు పాల్పడ్డారా? అనే సమాచారాన్ని పోలీసులు వెలుగులోకి తేనున్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు రావడంతో సీసీఎస్లో నమోదైన కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు(ఈడీ)కి సీసీఎస్ పోలీసులు అందించనున్నారు.
కార్వీపై మరో చీటింగ్ కేసు..
కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై సైబరాబాద్ పోలీసులు చీటింగ్ కేసును నమోదు చేశారు. రూ.563 కోట్ల మేర మోసం చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఈ కేసును సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగానికి అధికారులు బదిలీ చేశారు. దీంతో పోలీసులు ఏ1-కార్వీ, ఏ2-కంపెనీ డైరెక్టర్ యుగంధర్, ఏ3-పార్థసారధితోపాటు మరికొంత మంది మీద సెక్షన్ 406, 420, రెడ్విత్ 34 ఐపీసీల కింద అభియోగాలను నమోదు చేశారు. ఎన్ఎస్ఈ నిబంధనలకు వ్యతిరేకంగా డీమ్యాట్ ఖాతాదారుల షేర్లను వారికి తెలియకుండా వాటిని బ్యాంక్ల వద్ద సెక్యురిటీగా పెట్టి కార్వీ రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్సేంజ్) ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడింది.