Realme | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ జెయింట్ శాంసంగ్ తర్వాత భారత్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో చైనా సంస్థలు షియోమీ, ఒప్పో, వివో, వన్ ప్లస్ మోడల్స్దే హవా.. ఇతర ఫోన్ల తయారీ సంస్థలతో పోలిస్తే చైనా స్మార్ట్ ఫోన్లు కాస్త బడ్జెట్లో అందుబాటులో ఉంటాయి. వివిధ దేశాల్లో స్మార్ట్ ఫోన్ల వాడకంలో ప్రపంచంలోనే భారత్ది రెండో స్థానం. అత్యధిక ఫోన్లు చైనావే కావడంతో.. ఇండియాతోపాటు పలు దేశాల్లోని యూజర్ల డేటా డ్రాగన్ సేకరిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి.
భారత్ స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఎంతో ఇష్టమైన వాటిల్లో రియల్మీ ఫోన్ యూజర్ డేటా.. కాల్ లాగ్, ఎస్సెమ్మెస్, లొకేషన్ ఇన్ఫర్మేషన్ సేకరణకు ఎన్హ్యాన్స్డ్ ఇంటెలిజెంట్ సర్వీసెస్ (ఈఐఎస్) ఫీచర్ ఉంది. ఫోన్ సెట్టింగ్స్ అడిషనల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి సిస్టమ్ సర్వీసెస్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఈ ఈఐఎస్ ఫీచర్ కనిపిస్తుంది. ఇది ఎనేబుల్ చేస్తే యూజర్లకు తెలియకుండానే వారి సమాచారం సేకరిస్తుందని తెలుస్తున్నది. యూజర్ ప్రమేయం లేకుండా ఈఐఎస్ ఎనేబుల్ కావడం బలవంతపు చర్య అని, ఇలా సేకరించిన డేటా చైనాకు వెళుతుందా? అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రియాక్టయ్యారు. ఈ ఫీచర్ పరీక్షించి తనిఖీ చేస్తామని ట్వీట్ చేశారు.
రియల్మీ తోపాటు అన్ని చైనా ఫోన్ల తయారీ సంస్థల్లోనూ ఈ ఫీచర్ ఉందని, ఆ యూజర్ల డేటా సేకరించే అవకాశం ఉందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే, వివో, వన్ ప్లస్, ఐకూ, ఒప్పో, రియల్ మీ వంటి స్మార్ట్ ఫోన్ సంస్థలకు చైనా సంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్ పేరెంట్ సంస్థగా ఉన్నది. నెటిజన్ల ఆరోపణలపై రియల్ మీ రియాక్ట్ కావాల్సి ఉంది.