ఎలాన్ మస్క్ ఎప్పుడు ఏది చేసినా సంచలనమే. ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఎన్నో సంచలనాలకు మస్క్ కేంద్రబిందువుగా మారారు. నేపథ్యంలోనే మరోసారి సంచలన ప్రకటన చేశారు.
ట్విట్టర్లో కాల్స్, మెసెజ్లు పంపుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి గతంలోనే ఈ విషయమై ‘ట్విట్టర్ 2.0 ది ఎవ్రీథింగ్ యాప్’ పేరుతో ఎన్క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్లు, లాంగ్ ఫార్మ్ ట్వీట్లతో పాటు పేమెంట్స్ కూడా చేసుకునేందుకు కొత్త ఫీచర్లను తీసుకొస్తానని ప్రకటించారు. వీటన్నింటితో పాటు ట్విట్టర్ నుంచి వాయిస్, వీడియో కాల్స్ చేసుకునేలా ఫీచర్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి ఎలాంటి పరిమితులు లేవని, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఫోన్ నంబర్ అవసరం లేకుండా కాల్స్ చేసుకోవచ్చునని తెలిపారు.
అయితే ఈ తరహా సేవలు మెటాలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో వీడియో కాల్స్, మెసెజ్లు పంపించుకునే అవకాశం ఉంది. మెటా తరహాలోనే ట్విట్టర్లో సైతం కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
ట్విట్టర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్ ఎన్నో సంలన నిర్ణయాలు తీసుకున్నారు. కొనుగోలు చేయగానే దాదాపు 50 శాతం ఉద్యోగులను తొలగించారు. అంతేకాకుండా బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ను తీసుకొచ్చారు. పేమెంట్ చేయని అకౌంట్ల బ్లూ టిక్ సైతం తొలగించారు. అంతేకాకుండా ఎక్కువ కాలం యాక్టివ్గా లేని ఖాతాలను తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో కొంతమందికి ఫాలోవర్ల సంఖ్య తగ్గుతుందని వివరించారు.