Twitter Employees to Fire | మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలన్మస్క్.. కీలక నిర్ణయాల దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ట్విట్టర్లో ఉద్యోగాల కోత విధించడానికి ఎలన్మస్క్ నిర్ణయించుకున్నారని వినికిడి. ట్విట్టర్ కొనుగోలు చేయడానికి టెస్లాలో వాటాల విక్రయం ద్వారా దాదాపు 4 బిలియన్ల డాలర్ల నిధులను సేకరించారని వార్తలొచ్చాయి. తద్వారా ట్విట్టర్ కొనుగోలు సామర్థ్యం పెంచుకున్నారని చెబుతున్నారు. ట్విట్టర్లో కింది స్థాయి నుంచి పటిష్ఠపర్చడంపైనే కేంద్రీకరిస్తానని బ్యాంకర్లకు మస్క్ చెప్పారని అంటున్నారు. ఉద్యోగాల్లో కోత విధించడం ద్వారా ట్విట్టర్ సామర్థ్యం పెంపునకు ప్రాధాన్యం ఇస్తానని మస్క్ అన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ వార్తా కథనం ప్రచురించింది.
ట్విట్టర్ బోర్డు డైరెక్టర్ల వేతనాలను పూర్తిగా తొలగించడం ద్వారా 3 మిలియన్ల డాలర్లు ఆదా చేస్తానని స్వయంగా మస్క్ ట్వీట్ చేశారు. ఉద్యోగాల కోత విధిస్తానని బ్యాంకులకు హామీ ఇచ్చినప్పటికి పూర్తిగా ట్విట్టర్ను స్వాధీనం చేసుకునే వరకు ఆయన నిర్ణయాలు తీసుకోలేరు. వ్యాపార ఆదాయం పెంచుకోవడానికి సరికొత్త ఫీచర్లు సృష్టించాలని భావిస్తున్నట్లు బ్యాంకులకు ఇచ్చిన ప్లాన్లో తెలిపారని సమాచారం.
మస్క్ టేకోవర్ చేయడంతో ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ కొనసాగుతారా? అనే సందేహాలు కొనసాగాయి. దీనిపై గురువారం పరాగ్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ యాజమాన్యం చేతులు మారే వరకు తన బాధ్యతలు కొనసాగుతాయన్నారు. అవసరమైన మేరకు సర్వీసులను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తానన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎలన్మస్క్కు ట్విట్టర్ అప్పగింత ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు.