హైదరాబాద్, జనవరి 11(నమస్తే తెలంగాణ) భారత్, తుర్కియే దేశాల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం ఈ ఏడాది 20 బిలియన్ డాలర్లు (1.7 లక్షల కోట్లు)గా నిర్ణయించినట్లు తుర్కియే కాన్సుల్ జనరల్ ఆర్గాన్ యల్మాన్ ఓకాన్ పేర్కొన్నారు. గత ఏడాది ఇరుదేశాల మధ్య 12 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగిందని చెప్పారు. ఎఫ్టీసీసీఐకి చెందిన వ్యాపార ప్రతినిధులు గురువారం ఫెడరేషన్ భవన్లో తుర్కియే వ్యాపార ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆర్గాన్ మాట్లాడుతూ వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో తనవంతు సహకారం అందిస్తానని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. భారత్, తుర్కియేల మధ్య సంబంధాలు నిజామ్ కాలం నుంచే ఉన్నాయని గుర్తుచేశారు. ఎఫ్టీసీసీఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ సింఘాల్, ఆగ్రో ఫుడ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ చైర్మన్ చంద్రమోహన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.