CII on Cryptos | అసలే క్రిప్టో కరెన్సీలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని ఆర్బీఐ వాదిస్తూ ఉంటే ఇండియన్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ (సీఐఐ) వాటిని స్పెషల్ క్లాస్ సెక్యూరిటీస్గా పరిగణించాలని సూచిస్తున్నది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లు, ఫైనాన్సియల్ లావాదేవీల నియంత్రణకు అమలులో ఉన్న సెక్యూరిటీస్ రెగ్యులేషన్స్ను క్రిప్టో కరెన్సీలకు వర్తింప చేయొద్దని సీఐఐ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. క్రిప్టో కరెన్సీల నియంత్రణకు నూతన వ్యవస్థను రూపొందించి అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.
భారత్లో ఏర్పాటైన క్రిప్టో కరెన్సీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు, కస్టడీ ప్రొవైడర్లు.. సెబీ వద్ద తమ పేర్లు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఫైనాన్సియల్ మార్కెట్స్ ఇంటర్మీడియేటరీస్లో మాదిరిగాన కేవైసీ, ఎఎంఎల్ నిబంధనలను పాటించేలా చర్య తీసుకోవాలని సీఐఐ సూచించింది. అదే విధంగా డిజిటల్ వాలెట్లు పొందిన భాగస్వాముల క్రిప్టో లేదా డిజిటల్ టోకెన్లకు సదరు క్రిప్టో ఏజెన్సీలు భద్రత కల్పించాలని పేర్కొంది. ఆయా ఏజెన్సీలు చట్టబద్ధంగా బాధ్యత వహించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నది.