Digital Transactions | ఇప్పుడు అంతా డిజిటల్మయం. కరోనా మహమ్మారి పుణ్యమా? అని మొదలైన డిజిటల్.. ఆన్లైన్ చెల్లింపులు సులభతరం కావడంతో అందరూ అటువైపే మొగ్గుతున్నారు. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్స్, ప్రీపెయిడ్ కార్డు వంటి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు సాగుతున్నాయి. గతేడాది మొత్తం రూ.149.5 లక్షల కోట్ల విలువైన 87.92 బిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి.
యూపీఐ ట్రాన్సాక్షన్స్లో అత్యధికంగా పర్సన్ టు మర్చంట్స్ (పీ2ఎం), పర్సన్ టు పర్సన్ (పీ2పీ) పేమెంట్స్ సాగాయి. యూపీఐ లావాదేవీలు 84 శాతం జరిగితే పీ2ఎం పేమెంట్స్ 40, పీ2పీ చెల్లింపులు 44 శాతం అని వరల్డ్ లైన్ ఇండియా డిజిటల్ పేమెంట్స్ నివేదిక వెల్లడించింది. మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పీ2ఎం వాటా 18 శాతం అయితే, యూపీఐ పీ2పీ వాటా 66 శాతం. వ్యక్తుల మధ్య నగదు ట్రాన్స్ఫర్లే ప్రధానంగా ఉన్నాయి.
క్రెడిట్ కార్డుల వాడకం ఏడు శాతం, డెబిట్ కార్డుల వాడకం 14 శాతం నమోదవయ్యాయి. క్రెడిట్ కార్డుల వాడకంలో ఆరోగ్యకర వాతవరణం నెలకొందని తేలింది. వినియోగదారులు భారీ మొత్తాల చెల్లింపుల్లో క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. వరల్డ్వైడ్ ఇండియా సీఈవో రమేశ్ నరసింహన్ స్పందిస్తూ గత కొన్నేండ్లుగా డిజిటల్ పేమెంట్స్లో నమ్మశక్యం గానీ పురోగతి నమోదవుతున్నదన్నారు. బహుళ చెల్లింపుల మార్గాలను అనుసరించడంతో త్వరలోనూ క్యాష్లెస్ లావాదేవీల భారత్ కల సాకారం అవుతుందన్నారు.