ముంబై, మే 18: దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు ద్వారా జరిపే లావాదేవీలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. 2021 నుంచి 2025 మధ్యకాలంలో క్రెడిట్ కార్డు లావాదేవీలు 2.6 రెట్లు పెరిగాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ప్రైవేట్ రంగ బ్యాంకుల క్రెడిట్ కార్డుల మార్కెట్ వాటా మరింత పెరిగినట్టు తెలిపింది. 2021లో 216 కోట్ల క్రెడిట్ కార్డుల లావాదేవీలు జరుగగా..2025 నాటికి ఇవి 570 కోట్లకు చేరుకున్నాయి. విలువపరంగా చూస్తే రూ.8.9 లక్షల కోట్ల నుంచి రూ.23.2 లక్షల కోట్లకు చేరాయి. అంటే సగటున ఏడాదికి 27 శాతం చొప్పున ఎగబాకాయని పేమెంట్ సిస్టమ్ నివేదికలో వెల్లడించింది.
అలాగే డెబిట్ కార్డు లావాదేవీలు మాత్రం 408.7 కోట్ల నుంచి సగానికి సగం 133.6 కోట్లకు పడిపోయాయి. వీటి విలువపరంగా చూస్తే కూడా 2021లో రూ.7.4 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా, అదే 2025 నాటికి రూ.4.5 లక్షలకు తగ్గాయని తెలిపింది. 2021లో 67.7 శాతంగా ఉన్న ప్రైవేట్ రంగ బ్యాంకుల క్రెడిట్ కార్డుల వినిమయం 2025 చివరినాటికి 71.1 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల క్రెడిట్ కార్డుల వినిమయం 23.5 శాతం నుంచి 23.9 శాతానికి మాత్రమే పెరిగింది.