UPI Lite Limit | టెక్నాలజీతోపాటు ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఫోన్పే.. భారత్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి మొబైల్ యాప్స్ ద్వారా క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతున్నాయి. కానీ.. ఇంటర్నెట్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో ఆఫ్లైన్ పేమెంట్స్ కోసం.. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా (ఎన్పీసీఐ).. యూపీఐ లైట్ వాలెట్ సేవలు అందుబాటులోకి తెచ్చింది తొలుత ఒకేసారి గరిష్టంగా రూ.200 వరకు యూపీఐ లైట్ ద్వారా ఆఫ్ లైన్ పేమెంట్ సేవలు వచ్చాయి.
ఈ సేవలను మరింత ప్రోత్సహించేందుకు గరిష్ట పరిమితి రూ.200 నుంచి రూ.500 వరకూ పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. అయితే ఒక రోజులో అత్యధికంగా రూ.2000 వరకు మాత్రమే యూపీఐ లైట్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తూ ఈ నెల 10న నిర్ణయించింది. తదనుగుణంగా ఈ నెల 24 నుంచి యూపీఐ లైట్ పేమెంట్స్ రూ.500 అమల్లోకి వచ్చింది.
చిన్న మొత్తాల కొనుగోళ్లు, ట్రాన్సిట్ పేమెంట్స్కు కూడా టూ-ప్యాక్టర్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ సౌమ్య కాంతిఘోష్ స్పందిస్తూ.. ‘యూపీఐ లైట్/ ఎన్సీఎంసీ కార్డ్ వాలెట్ కార్డులా పని చేస్తుంది. యూపీఐ లైట్ సేవలు వాడుకోవడానికి యాప్ లేదా కార్డులో ముందస్తుగా మనీ అప్ లోడ్ చేయాలి. దీంతో ఇంటర్నెట్ లేకున్నా ఆఫ్ లైన్ మోడ్లో చెల్లింపులు జరుగుతాయి. అయితే, ఆన్ లైన్ లో మాత్రమే యూపీఐ లైట్ వాలెట్లోకి మనీ క్రెడిట్ అవుతాయి’ అని తెలిపారు.
ఇన్-సొల్యూషన్స్ గ్లోబల్ కో-ఫౌండర్ కం మేనేజింగ్ డైరెక్టర్ అడిలియా కాస్టెలినో స్పందిస్తూ.. ‘ఆఫ్ లైన్ మోడ్లో యూపీఐ లైట్ ద్వారా చెల్లింపులు రూ.200 నుంచి రూ.500 వరకు పెంచడం సానుకూల చర్య. రోజువారీ ఖర్చులకు యూపీఐ లైట్ సానుకూల ఆప్షన్. దీనివల్ల ప్రజలు సౌలభ్యాన్ని బట్టి డిజిటల్ పేమెంట్ పద్దతులు అవలంభించడానికి మరింత మందిని ప్రోత్సహించవచ్చు’ అని తెలిపారు.