న్యూఢిల్లీ, మార్చి 23: అవాంఛిత కాల్స్, సందేశాలపై టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ క్రమంలోనే మొబైల్ వినియోగదారులకు విసుగు పుట్టిస్తున్న పెస్కీ మార్కెటింగ్ కాల్స్, మెసేజ్ల అంశంపై టెలికం సంస్థలతో ఈ నెల 27 (సోమవారం)న సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా అన్సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ (యూసీసీ) డిటెక్ట్ సొల్యూషన్స్ అమలు, దాని పురోగతిపై ట్రాయ్ ఆరా తీయనున్నది. అవాంఛిత కాల్స్, సందేశాలను గుర్తించి, తగిన పరిష్కారాలతో మొబైల్ యూజర్లకు ఇబ్బంది లేకుండా చేసే ప్రక్రియే ఈ యూసీసీ డిటెక్ట్ సొల్యూషన్స్. ‘సాంకేతికంగా, నియంత్రిత వ్యవస్థల విధానాల పరంగా, సూచనల ద్వారా ఈ సమస్య పరిష్కారానికి బహుళ మార్గాల్లో ప్రయత్నిస్తున్నాం. యూసీసీ డిటెక్ట్ సొల్యూషన్స్ అమలు, పురోగతిపై టెలికం కంపెనీలతోనూ సమావేశం కాబోతున్నాం. ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా నాయకత్వంలో ఈ నెల 27న ఇది జరుగుతుంది’ అని ట్రాయ్ స్పష్టం చేసింది.
2019లో..
పెస్కీ మార్కెటింగ్ కాల్స్, మెసేజ్లకు అడ్డుకట్ట వేయడానికి 2018 జూలై 19న టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ను ట్రాయ్ జారీ చేసింది. 2019 ఫిబ్రవరి 28 నుంచి ఈ రెగ్యులేషన్స్ అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే బ్లాక్చైన్ టెక్నాలజీ సాయంతో డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ) అనే ఎకోసిస్టమ్నూ తెచ్చారు. అయినా పూర్తిస్థాయిలో ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదన్న అసంతృప్తి ఉన్నది. నెట్వర్క్ ఏదైనా.. మొబైల్ వినియోగదారులకు రోజూ ఈ పెస్కీ కాల్స్, మెసేజ్ల బెడద తప్పట్లేదు మరి. తీరికలేని పనిలో ఉన్నప్పుడో, డ్రైవింగ్ చేస్తున్నప్పుడో ఏదో ఓ ఫోన్ కాల్ వస్తుంది. దాన్నికాస్తా అటెండ్ చేస్తే సిస్టమ్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంది. ఇక మెసేజ్లైతే కుప్పలుతెప్పలుగా వస్తూంటాయి. ఫోన్లో ఇన్బాక్స్ను క్లియర్ చేయడం ఓ పనిగా పెట్టుకోవాల్సి వస్తున్నది.