న్యూఢిల్లీ, జూన్ 3: అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లకు అడ్డుకట్టలో భాగంగా టెలికం సంస్థలకు ట్రాయ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషనల్ కాల్స్ (అడ్వైర్టెజ్మెంట్ మొబైల్ ఫోన్ కాల్స్), మేసేజ్ల కోసం వినియోగదారుల అంగీకారానికి ఓ యూనిఫైడ్ డిజిటల్ వేదికను రెండు నెలల్లో తీసుకురావాలని టెల్కోలకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ స్పష్టం చేసింది. ముందుగా ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్లను అందుకోవడానికి సబ్స్ర్కైబర్లు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుందని, ఆ తర్వాతే బ్యాంకులు, బీమా-ఆర్థిక సంస్థలు, వాణిజ్య-వ్యాపార, రియల్ ఎస్టేట్ తదితర కంపెనీలు ఆయా కస్టమర్లను సంప్రదించి వారి అంగీకారం మేరకు అడ్వైర్టెజ్మెంట్ కాల్స్, సందేశాలను పంపడం ఆరంభిస్తాయంటూ డిజిటల్ వేదికగా జరిగే ప్రక్రియను శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ట్రాయ్ వివరించింది.
ప్రస్తుతం ప్రమోషనల్ సందేశాలను పొందడం కోసం కస్టమర్ల సమ్మతిని తెలుసుకొనే ఎటువంటి వ్యవస్థ కూడా లేదు. దీంతో సమయం, సందర్భం లేకుండా అవాంఛిత మొబైల్ కాల్స్, మెసేజ్లు అందరికీ ఎడాపెడా వచ్చేస్తున్నాయి. దీనిపై ట్రాయ్కి వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెలికం సంస్థలకు పైవిధంగా ట్రాయ్ ఆదేశించింది.