న్యూఢిల్లీ, నవంబర్ 24: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా టెలికం రెగ్యులేటర్ ట్రాయ్.. మొబైల్ బ్యాంకింగ్, పేమెంట్ సర్వీసెస్ కోసం యూఎస్ఎస్డీ సందేశాలపై చార్జీలను ఎత్తివేయాలని బుధవారం ప్రతిపాదించింది. ఈ అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డాటా (యూఎస్ఎస్డీ) మెసేజ్లు మొబైల్ స్క్రీన్పై మాత్రమే కనిపిస్తాయి. ఇతర ఎస్ఎంఎస్ల మాదిరిగా స్టోర్ అవ్వవు. ఉదాహరణకు మొబైల్ ఫోన్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి నెట్వర్క్ సంస్థకు కస్టమర్ కాల్ లేదా ఎస్ఎంఎస్ చేసినప్పుడు స్క్రీన్పై కనిపించేది ఈ యూఎస్ఎస్డీ మెసేజ్లే. ప్రస్తుతం ఒక్కో యూఎస్ఎస్డీ సెషన్కు 50 పైసలు చొప్పున చార్జ్ చేసేలా ట్రాయ్ పరిమితి పెట్టింది. ఇప్పుడు దీన్నీ పూర్తిగా తొలగించాలని చెప్తున్నది. కాగా, ఈ చార్జీల తొలగింపు సలహాను డిజిటల్ పేమెంట్లను మరింత పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీనే ట్రాయ్కి ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా కమిటీ సిఫార్సును ట్రాయ్ తాజాగా ప్రతిపాదించింది. ఇదిలావుంటే డిసెంబర్ 8లోగా ఈ డ్రాఫ్ట్ ప్రతిపాదనపై ఇండస్ట్రీ అభిప్రాయాలను తెలుపాలని ట్రాయ్ ఆహ్వానించింది.