టోక్యో : రాబోయే దశాబ్ధంలో ఎలక్ట్రిక్ కార్లు, ఎస్యూవీలు, స్పోర్ట్స్ కార్లతో డజన్ల కొద్దీ ఈ వెహికల్స్ను లాంఛ్ చేయనున్నట్టు టొయోటా వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలను పెద్దసంఖ్యలో ఎంటర్ చేస్తామని భారీ ప్రణాళికలను ప్రకటించింది. ఎలక్ట్రిక్ క్రాసోవర్లు, ఎలక్ట్రిక్ ఎస్యూవీలు, ఎలక్ట్రిక్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రిక్ పికప్ ట్రక్స్, ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్లతో ఈ-బాట పట్టనుంది.
2030 నాటికి టొయోటా, లెక్సస్ 30 న్యూ ఎలక్ట్రిక్ ఉత్పత్తులను ప్రవేశపెట్టనుండగా అందులో సగం మోడల్స్ 2025 నాటికి లాంఛ్ కానున్నాయి. ఆయా కార్లపై మరిన్ని వివరాలను టొయోటా వెల్లడించకపోయినా లెక్సస్ స్పోర్ట్స్ కారు అత్యాధునిక ఫీచర్లతో ఎంట్రీ ఇస్తుందని ఇది కేవలం రెండు సెకండ్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని చెబుతున్నారు.
ఇక టొయోటా తొలి లాంగ్ రేంజ్ ఈవీ బీజడ్4ఎక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ అమెరికాలో 2022 ద్వితీయార్ధంలో లాంఛ్ అవుతుందని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించిన టొయోటా బ్యాటరీ వెహికల్ టెక్నాలజీపై ఏకంగా 1760 కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ప్లాంట్లను ఈవీ ప్లాంట్లుగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.