TotalEnergies – Adani | అమెరికాలోని హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదికతో అదానీ గ్రూప్తో భాగస్వామ్యంపై ఫ్రాన్స్ ఎనర్జీ మేజర్ `టోటల్ ఎనర్జీ` సంచలన ప్రకటన చేసింది. అదానీ 50 బిలియన్ డాలర్ల హైడ్రోజన్ ప్రాజెక్ట్లో భాగస్వామ్యంపై నిర్ణయం వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అదానీ గ్రూప్ సంస్థల లావాదేవీలపై హిండెన్బర్గ్ నివేదిక విషయమై స్పష్టత వచ్చే వరకు ముందుకెళ్లడం లేదని తేల్చి చెప్పింది. అదానీ గ్రూప్తో తమ భాగస్వామ్యంపై `టోటల్ ఎనర్జీస్` గతేడాది జూన్లో ప్రకటన చేసింది. అయితే, ఇప్పటి వరకు అదానీ గ్రూప్తో భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేయలేదని టోటల్ ఎనర్జీస్ సీఈవో పాట్రిక్ పౌయన్నె తెలిపారు.
గతేడాది జూన్లో చేసిన ప్రకటన ప్రకారం అదానీ న్యూ ఎనర్జీస్లో టోటల్ ఎనర్జీస్ 25 శాతం వాటా తీసుకోవాల్సి ఉంటుంది. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో రెండు సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పంద ఎజెండా. ఇందుకోసం వచ్చే పదేండ్లలో అదానీ న్యూ ఇండస్ట్రీస్లో టోటల్ ఎనర్జీ 5000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
హిండెన్బర్గ్ నివేదికపై క్లారిటీ వచ్చే వరకు హైడ్రోజన్ ప్రాజెక్టుపై ముందుకెళ్లం అని పౌయన్నే తెలిపారు. అయితే, ఇప్పటికే అదానీ గ్రూప్లో టోటల్ ఎనర్జీస్ 310 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తున్నది. అదానీ గ్రూప్ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, స్టాక్ మార్కెట్లలో ఫ్రాడ్ జరుగుతున్నదని హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. దీనిపై అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న అడిటింగ్ నివేదిక వచ్చే వరకు అదానీ న్యూ ఇండస్ట్రీస్తో తమ పార్టనర్షిప్ నిలిపేస్తున్నట్లు టోటల్ ఎనర్జీస్ తెలిపింది.