IT Returns | గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువు దగ్గర పడుతున్నది. ఆదివారంతో ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు దగ్గర పడుతుండటంతో ఐటీఆర్ ఫైల్ చేస్తున్న వేతన జీవుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదాయం పన్ను విభాగం అధికారిక వెబ్సైట్ `ఐటీ ఈ-ఫైలింగ్` పోర్టల్ ప్రకారం బుధవారం నాటికి 3.73 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. వాటిలో 2.93 ఐటీ రిటర్న్స్ వెరిఫై చేశామని ఐటీ విభాగం వెల్లడించింది. వెరిఫై చేసిన ఐటీఆర్లలో 2.18 కోట్ల ఐటీఆర్లను ప్రాసెస్ చేసినట్లు తెలిపింది. 2021-22 అంచనా (2020-21) సంవత్సరంతో పోలిస్తే బుధవారం వరకు 2022-23 అంచనా (2021-22) సంవత్సరంలో 44 శాతం తక్కువ ఐటీఆర్లు ఫైల్ అయ్యాయి.
ఆదాయం పన్ను విభాగం తెలిపిన వివరాల మేరకు గత మార్చి 15 నాటికి 6.63 కోట్లకు పైగా ఐటీఆర్లు దాకలయ్యాయి. వాటిల్లో కార్పొరేట్లు, ఇతర పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్-1 కింద 3.03 కోట్లు, ఐటీఆర్-2 కింద 57.2 లక్షలు, ఐటీఆర్-3 కింద 1.02 కోట్లు, ఐటీఆర్-4 కింద 1.75 కోట్లు, ఐటీఆర్-5 కింద 15.1 లక్షలు, ఐటీఆర్-6 కింద 9.3 లక్షలు, ఐటీఆర్-7 ఫామ్ కింద 2.18 లక్షల ఐటీఆర్లు దాఖలయ్యాయి. వీటిలో 43 శాతానికి పైగా ఐటీ విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్లో ఆన్ లైన్ వేదికగా ఐటీఆర్లు ఫైల్ అయ్యాయి. మిగతా ఐటీఆర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్తోపాటు ఆఫ్లైన్ ఐటీఆర్ ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ ద్వారా సబ్మిట్ అయ్యాయని ఆదాయం పన్ను విభాగం పేర్కొంది.