న్యూఢిల్లీ, జనవరి 26: ఈ-కామర్స్ సేవల సంస్థ అమెజాన్ ఆధిపత్యానికి ఫ్లిప్కార్ట్ గండికొట్టింది. గత కొన్నేండ్లుగా దేశీయ ఈ-కామర్స్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అమెజాన్పై వాల్మార్ట్ గ్రూపునకు చెందిన ఫ్లిప్కార్ట్ పైచేయి సాధించింది. 48 శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోతున్నదని ఒక సర్వే వెల్లడించింది. ఫ్లిప్కార్ట్ ప్రవేశపెడుతున్న పలు ఆఫర్లే ఇందుకు కారణమని అలయెన్స్ బెర్న్స్టెయిన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. మరోవైపు, సాఫ్ట్బ్యాంక్ వెనుకుండి నడిపిస్తున్న మీషో..అత్యధిక వేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ సంస్థగా రికార్డు నెలకొల్పినట్లు తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్కార్ట్ వినియోగదారులు 21 శాతం చొప్పున పెరగగా, అలాగే మీషో కస్టమర్లు కూడా 32 శాతం అధికమయ్యారు. కానీ, ఇదే సమయంలో అమెజాన్ 13 శాతం మంది కస్టమర్లను కోల్పోయింది.
అమెజాన్కు ఆఫర్లు దెబ్బ
కస్టమర్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో అమెజాన్ ప్రకటించిన ఆఫర్లు బెడిసికొడుతున్నాయి. తన పోటీ సంస్థ ఫ్లిప్కార్ట్ ఆఫర్ల కంటే అమెజాన్ ఆఫర్లు అంతగా ఆకట్టుకుంటలేవని, ముఖ్యంగా మొబైళ్లు, దుస్తులపై ఆఫర్లు అంతంత మాత్రంగానే ఉండటంతో కొనుగోలుదారులు ఫ్లిప్కార్ట్కు జైకొడుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 48 శాతం మార్కెట్ వాటాతో ఫ్లిప్కార్ట్ తన తొలి స్థానాన్ని పదిలం చేసుకున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీ వృద్ధి కంటే ఫ్లిప్కార్ట్ అధికంగా వృద్ధిని సాధించడం విశేషం. ముఖ్యంగా మొబైళ్లు, దుస్తుల బుకింగ్లో సంస్థ దూసుకుపోతున్నదని తెలిపింది. మొత్తం బుకింగ్లో మొబైళ్ల వాటా 50 శాతం ఉండగా, దుస్తుల వాటా 30 శాతంగా ఉన్నదని పేర్కొంది. కానీ, ఫ్లిప్కార్ట్ మాత్రం అంచనా ఎక్కువగా ఉన్నది. ఆన్లైన్లో అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో సంస్థ వాటా 60 శాతంగాను, ఫ్యాషన్ మార్కెట్లో 48 శాతంగా ఉంటుందని అంచనావేస్తున్నది.
ఫ్యాషన్ ఈ-కామర్స్లో మింత్రా టాప్
ఫ్యాషన్ ఈ-కామర్స్ సంస్థల్లో ఫ్లిప్కార్ట్నకు చెందిన మింత్రా 50 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. రిలయన్స్కు చెందిన ఆజియ 30 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నది. గత నెలలో మింత్రా అత్యధికంగా 25 శాతం వృద్ధిని సాధించింది. అలాగే ఈ-గ్రాసరీ సంస్థ బ్లింకిట్ అత్యధిక వృద్ధిని సాధించిన సంస్థగా నెలకొల్పింది.
చిన్న నగరాలపై మీషో దృష్టి
ద్వితీయ శ్రేణి నగరాలతోపాటు చిన్న స్థాయి పట్టణాలపై మీషో ప్రత్యేక దృష్టి సారించడం కలిసొచ్చింది. కంపెనీ వెబ్సైట్లో బుకింగ్ చేసుకున్నవారికి ఎలాంటి అదనపు చార్జీలు విధించకపోవడం, అలాగే తక్కువ సమయంలో తాము బుకింగ్ చేసుకున్న వస్తువును అందిస్తుండటంతో ఇటీవల కాలంలో మీషోకు కస్టమర్లు పెరుగుతున్నారు. గడిచిన 12 నెలల్లో మీషో ఆర్డర్లలో 43 శాతం వృద్ధి నమోదైంది. ఒక్కసారి బుకింగ్ చేసుకున్న కస్టమర్లు తిరిగి బుకింగ్ చేసుకుంటుండటంతో కంపెనీ ఆదాయం 54 శాతం మేర పెరిగింది. మీషో వెబ్సైట్లో ఉన్న కస్టమర్లలో 95 శాతం అన్బ్రాండెండ్ ఉత్పత్తులు అయినప్పటికీ కొనుగోలుదారులు ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు. ప్రస్తుతం మీషోకు ప్రతినెల 1.2 కోట్ల మంది సరాసరి నెలసరి యూజర్లు యాక్టివ్గా ఉంటున్నారని నివేదిక తెలిపింది. ఇలాగే ఉంటే త్వరలో మీషో దేశీయ ఈ-కామర్స్ రంగంలో తొలి స్థానంలోకి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. నీల్సన్ మీడియా నివేదికలో అమెజాన్ కస్టమర్ల బ్రాండ్గా గతంలో ఉండింది.