Tomoto @ Madanapalli | రోజువారీ కూరల్లో వాడే టమాట ప్రతి కుటుంబానికి చుక్కలు చూపిస్తున్నది. గత కొన్ని రోజులుగా పైపైకి దూసుకెళ్తున్న టమాట ధర శనివారం ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్లో నాణ్యమైన టమాట కిలో ధర రూ.196 లకు చేరుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. అత్యల్పంగా రూ.140లకు కిలో టమాట లభిస్తున్నది.
ప్రస్తుత సీజన్ టమాట తోటలు చివరి దశకు చేరుకుంటున్నాయి. మరోవైపు ఇతర ప్రాంతాల్లో దిగుబడి తగ్గిపోయింది. దీంతో శనివారం మదనపల్లి కూరగాయల మార్కెట్లు శనివారం కేవలం 253 టన్నుల టమాట మాత్రమే వచ్చింది. ఫలితంగా టమాట ధర ఆల్ టైం రికార్డులు నమోదు చేస్తున్నాయని మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యాపారులు చెబుతున్నారు.
మదనపల్లి మార్కెట్లో మొదటి రకం టమాటా కిలో రూ.160-196 పలికితే రెండో రకం రూ.120-156 పలికింది. వ్యాపారులు 25 కిలోల టమాటల బుట్టను రూ.4500- రూ.4900 మధ్య కొనుగోలు చేశారు.
ఇదిలా ఉంటే, చిత్తూరు జిల్లాకు చెందిన మురళి అనే రైతు కేవలం 45 రోజుల్లోనే టమాటల విక్రయంతో రూ.4 కోట్ల ఆదాయం సంపాదించాడు. గతేడాది సరైన ధర లేక రూ.1.5 కోట్ల అప్పుల పాలైన మురళి.. ఈ ఏడాది వచ్చిన ఆదాయంతో రుణం తీర్చేశాడు. తాజాగా ఈ ఏడాది టమాట తోట విస్తీర్ణం మరింతగా పెంచాలని తలపోస్తుండటం ఆసక్తికర పరిణామం.