హైదరాబాద్, ఏప్రిల్ 11: టైర్ల ధరలకు రెక్కలొచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇప్పటికే పలు ఉత్పత్తుల భగ్గుమంటుండటంతో తాజాగా టైర్లు కూడా ఈ జాబితాలోకి చేరాయి. జపాన్కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యోకోహమా ధరలను భారీగా పెంచేసింది. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడిసరుకులైన రబ్బర్, కార్బన్ బ్లాక్, కెమికల్స్, నైలాన్, పాలిస్టర్తోపాటు పెట్రోలియం డెరివేటివ్ ఉత్పత్తుల ధరలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడంతో టైర్ల ధరలను మూడు శాతం వరకు సవరించాల్సి వచ్చిందని కంపెనీ మార్కెటింగ్ హెడ్ గౌరవ్ మహజన్ తెలిపారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరోసారి ధరల పెంపు తప్పదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. యుద్ధం ప్రభావంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను తప్పని పరిస్థితుల్లో స్వల్పంగా పెంచాల్సి వచ్చిందన్నారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు దిగుమతులు భారీగా తగ్గడంతో టైర్ల తయారీ సంస్థలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావచ్చునని ఆయన పేర్కొన్నరు.
భారత్లో రూ.1,500 కోట్ల పెట్టుబడి
దేశీయంగా టైర్లకు ఉన్న డిమాండ్ను దృష్లి పెట్టుకొని భారత్లో ఇప్పటి వరకు రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పినట్టు చెప్పారు. వీటిలో రూ.750 కోట్లతో ఒకటి హరియాణాలో నెలకొల్పగా, మరొకటి రూ.750 కోట్లతో వైజాగ్లో గతేడాది ప్రారంభించింది. వైజాగ్లో నెలకొల్పిన ప్లాంట్ కెపాసిటీ 17 లక్షల యూనిట్లు అయినప్పటికీ ఇప్పటి వరకు రెండింట మూడోవంతు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సంస్థ 12 ఇంచుల నుంచి 20 ఇంచుల కెపాసిటీ కలిగిన టైర్లను తయారు చేసి, విక్రయిస్తున్నది. ప్రధానంగా దేశీయంగా ఎస్యూవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని టైర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నట్టు ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి నమోదైందని, కానీ ఈసారి మాత్రం తగ్గే అవకాశాలున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 3,300 టచ్పాయింట్లు ఉండగా, వీటిలో 800 ప్రత్యేక అవుట్లెట్లను నెలక్పొంది. కంపెనీ ఉత్పత్తులు ప్రస్తుతం సార్క్ దేశాలతోపాటు ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నది.