ముంబై: భారత్లో ఫైనాన్సియల్ సేవలందించేందుకు టెక్ దిగ్గజాలు పోటీ పడుతుండటంతో నియంత్రణ సంస్థలకు సమస్యలు ఎదురవుతున్నాయని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఏకఛత్రాధిపత్యం, యాంటీ ట్రస్ట్, సైబర్ సెక్యూరిటీ, డైటా ప్రైవసీ వంటి సవాళ్లు ముందుకు వస్తున్నాయని పేర్కొంటూ ఓ నివేదికను వెల్లడించింది. ఫైనాన్సియల్ సర్వీసులకు సంబంధించి పలు అంశాల్లో ఇబ్బందులు వస్తాయని ఆయా సంస్థలను హెచ్చరించింది.
ఆర్థిక వ్యవస్థలుగా రూపుదిద్దుకుంటున్న దేశాల్లో పెద్ద టెక్నాలజీ సంస్థలు డిజిటల్ ఫైనాన్సియల్ సేవలు అందిస్తున్నాయని ఆర్బీఐ తన ఫైనాన్సియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో పేర్కొంది. ఆపరేషనల్ రిస్క్, నిరంతర ఫెయిల్యూర్స్ వంటి సమస్యలు తలెత్తుతాయని స్పస్టం చేసింది.
గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐదు టెక్ దిగ్గజాలు గుత్తాధిపత్యం వహిస్తున్నాయి. వీటిలో ఒక్కో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.150 లక్షల కోట్ల నుంచి రూ.175 లక్షల కోట్లు ఉంటున్నది. ఇప్పటికే నూతన ఐటీ రూల్స్ అమలు విషయంలో కేంద్రంతో ట్విట్టర్ మధ్య ఉప్పూ నిప్పూ అన్నట్లు ఉండగా ఆర్బీఐ నివేదిక వెల్లడించడం గమనార్హం..
భారత్ రియల్ టైం పేమెంట్ నెట్వర్క్.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)తో అమెజాన్, గూగుల్, వాట్సాప్ భాగస్వాములుగా ఉన్నాయి. అమెజాన్, గూగుల్ తమ పేమెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి రుణాలు, కార్డు రునాలు అనుమతిస్తున్నాయి.
భారత్ ఫైనాన్సియల్ మార్కెట్లో టెక్ సంస్థలు సేవలందించడంతో మూడు సవాళ్లు ఎదురు కానున్నాయి. ఆర్థికేతర సేవలను ఆఫర్ చేయడం వల్ల సరైన విధానం ఏదో తెలియకుండా పోతుందని పేర్కొంది. టెక్ సంస్థలే దేశంలోని ఆర్థిక సేవల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది.
వీటి నియంత్రణకు గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు, ఫైనాన్సియల్ రెగ్యులేటర్లు అంతర్జాతీయ ప్రమాణాలు రూపొందించాలని ఆర్బీఐ సూచించింది. అయితే, ఆర్థిక సేవల్లో టెక్ సంస్థల గుత్తాధిపత్యాన్ని, కాంపిటీషన్ రిస్క్లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నియంత్రించనున్నది. అందుకు యూపీఐలో థర్డ్ పార్టీ యాప్స్కు మార్కెట్ షేర్పై ఆర్బీఐ పరిమితి విధించింది.