SBI Annuity Deposit Scheme | సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలతోపాటు తన ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) పలు రకాల పథకాలు, ప్లాన్లు అమలు చేస్తు్న్నది. వాటిల్లో ఒకటి ‘ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ (SBI Annuity Deposit Scheme). ఒక్కసారి భారీ మొత్తంలో డిపాజిట్ చేసి, ప్రతి నెలా కొంత మొత్తం ఆదాయంగా పొందాలని భావించే వారికి సరైన స్కీం. యాన్యుటీ డిపాజిట్ స్కీం మీద సాధారణ సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువ వడ్డీ ఆదాయం లభిస్తుంది.
చాలా మంది భారీగా డబ్బు సేవింగ్స్ చేస్తారు. దాని నుంచి ప్రతి నెలా ఆదాయం పొందాలని భావిస్తారు. అలాగని, బయట వడ్డీకి ఇవ్వడం అంత సేఫ్ కాదు. అలాగని ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో జమ చేస్తే మెచ్యూరిటీ టైం ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేసినా రిటర్న్స్ మీద ఖచ్చితమైన గ్యారంటీ ఉండదు. కానీ.. ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ .. అటువంటి వారికి సరిపోతుంది.
ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు ఒకేసారి భారీ మొత్తంలో జమ చేయాలి. అలా జమ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీతోపాటు.. జమ చేసిన మొత్తంలో కొంత ప్రతి నెలా డిపాజిటర్ ఖాతాలో జమ చేస్తారు. భారతీయ సిటిజన్ షిప్ గల వారెవ్వరైనా ఈ స్కీంలో చేరొచ్చు. మైనర్లకు కూడా ఈ స్కీం అందుబాటులో ఉంటుంది.
ఈ స్కీంలో చేరిన వారి డిపాజిట్లపై గరిష్ట పరిమితి లేదు. మూడేండ్లు, ఐదేండ్లు, ఏడేండ్లు, 10 ఏండ్ల కాల పరిమితితో నగదు డిపాజిట్ చేయవచ్చు. దేశంలోని ఏ ఎస్బీఐ శాఖలోనైనా ఈ పథకం కింద ఇన్వెస్ట్ చేయవచ్చు.
టర్మ్ డిపాజిట్కు వర్తించే వడ్డీరేట్లే.. యాన్యుటీ ప్లాన్కూ వర్తిస్తాయి. ప్రతి నెలా వచ్చే యాన్యుటీ మొత్తం.. సంబంధిత డిపాజిటర్.. సేవింగ్స్ లేదా కరంట్ ఖాతాలో డిపాజిట్ అవుతుంది. ప్రతి నెలా కనీసం రూ.1000 యాన్యుటీ వచ్చేలా నగదు డిపాజిట్ చేయాలి.
ఏ ఎస్బీఐ శాఖకైనా ఈ పథకాన్ని బదిలీ చేసుకోవచ్చు. నామినీని కూడా ఎంపిక చేయొచ్చు. నగదు డిపాజిట్ చేసిన తేదీ ప్రకారం.. ప్రతి నెలా అదే తేదీన యాన్యుటీ సంబంధిత వ్యక్తి ఖాతాలో డిపాజిట్ అవుతుంది. ఒకవేళ ఆ తేదీ ఒక నెలలో లేకపోతే.. తదుపరి నెల మొదటి రోజే డిపాజిట్ చేస్తారు.
ప్రతి నెలా యాన్యుటీ అందుకోవడంతోపాటు మొత్తం డిపాజిట్ మీద 75 శాతం వరకు ఓవర్ డ్రాఫ్ట్ లేదా రుణం కింద పొందొచ్చు. రుణం తీసుకున్న వారి యాన్యుటీ మొత్తం.. సంబంధిత రుణం ఖాతాలో డిపాజిట్ అవుతుంది.
ఈ పథకం కింద రూ.15 లక్షల వరకు చేసే డిపాజిట్లు ముందస్తుగా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, డిపాజిట్ నిబంధనలకు అనుగుణంగా పెనాల్టీ పే చేయాలి. ఒకవేళ డిపాజిటర్ మరణిస్తే.. మిగతా మొత్తం నామినీకి, చట్టపరమైన వారసులకు చెల్లిస్తారు.
ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తంపై టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు అమలవుతాయి. అలా వచ్చే వడ్డీతోపాటు డిపాజిట్ చేసిన మొత్తంలో కొంత కలిపి.. డిపాజిటర్ కు చెల్లిస్తారు. ప్రతి నెలా డిపాజిట్.. తదనుగుణంగా వడ్డీ తగ్గుతూ ఉంటుంది. ప్రతి నెలా వచ్చే యాన్యుటీ మొత్తంలో డిపాజిట్ నుంచి పే చేసే వాటా పెరుగుతుంది.