న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఇన్వెస్టర్లలో ఆసక్తి ఉన్న న్యూటెక్నాలజీ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)పై కేంద్రం గురిపెట్టడంతో తొలిరోజునే ఈ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. మార్కెట్ ధరకంటే 7 శాతం తక్కువకు ఐఆర్సీటీసీ షేరుకు రూ.680 ఫ్లోర్ ధరను నిర్ణయిస్తూ హఠాత్తుగా కేంద్రం 5 శాతం వాటా విక్రయానికి ఓఎఫ్ఎస్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. చౌక ధర కారణంగా గురువారం సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రారంభమైన ఈ ఆఫర్ ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది.
రూ. 3,800 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఫ్లోర్ ధర ప్రకారం ఓఎఫ్ఎస్ (4 కోట్ల షేర్లు) పరిమాణం విలువ రూ. 2,720 కోట్లు. ఈ ఆఫర్కు 10 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. రిటైలర్ల బిడ్డింగ్ శుక్రవారం జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం తక్కువస్థాయిలో ఫ్లోర్ ధరను ప్రకటించిన నేపథ్యంలో గురువారం బీఎస్ఈలో 6 శాతంపైగా క్షీణించి రూ.689 వద్దకు తగ్గింది. ఐఆర్సీటీసీలో ప్రభుత్వానికి 67.40 శాతం వాటా ఉంది. 5 శాతం వాటా విక్రయం ద్వారా సమకూరిన నిధులు డిజిన్వెస్ట్మెంట్ ఖాతాలోకి వెళతాయి. పీఎస్యూల్లో వాటాల విక్రయం ద్వారా రూ.65,000 కోట్ల డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని కేంద్ర బడ్జెట్లో నిర్దేశించుకుంది.