ముంబై : దేశంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ అడుగుతీసి బయటపెట్టాలంటే దేశంలోనే అత్యంత ఖరీదైన కాన్వాయ్ ఆయనను అనుసరించాల్సిందే. భారత్ లో ఓ ప్రైవేట్ వ్యక్తిని ఇంతటి ఖరీదైన కార్ల వరస అనుసరించడం ముఖేష్ అంబానీ ప్రత్యేకతను చాటుతోంది. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లాలంటే ముఖేష్ అంబానీ సాయుధ మెర్సిడెస్ బెంజ్ లో ఆశీనుడైతే ఆయన వాహనం వెంట సెక్యూరిటీ వాహనాలు బారులుతీరి బయలుదేరతాయి. అంబానీ గ్యారేజ్ లో కార్లు కొలువుతీరిన తీరును సీఎస్ 12 వ్లోగ్స్ వీడియో కండ్లకు కడుతోంది.
అంబానీ కాన్వాయ్ లో గత ఏడాది కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్స్ నుంచి పలు లగ్జరీ కార్లు సందడి చేస్తాయి. కాన్వాయ్ మధ్యలో రోల్స్ రాయ్స్ ఫాంటమ్ 8 ఇడబ్ల్యూబీ ప్రధాన ఆకర్షణ కాగా, ఇది ముంబై ఆన్ రోడ్ ధర రూ 14 కోట్లు పలుకుతోంది. ఇక పైలట్ కారు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ధర రూ 2 కోట్లు. కాన్వాయ్ లో ఇలాంటి కార్లు మరో రెండు ఉంటాయి. ఇక సెక్యూరిటీ కార్లు సైతం ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్ బెంజ్ జీ వేగన్, రేంజ్ రోవర్ వోగ్, ల్యాండ్ రోవర్ డిస్కవరీ వంటి ఖరీదైన వాహనాలే కావడం గమనార్హం.
ఇవి కాకుండా అంబానీ కుటుంబానికి బెంట్లీ బెంటాగ వాహనాలు, రెండు రోల్స్ రాయ్స్ కలినన్ కార్లు, మసరాటి లెవంటె సహా పలు లగ్జరీ ఎస్ యూవీలున్నాయి. ముఖేష్ అంబానీ తన కోసం ప్రత్యేకంగా కేటాయించిన వాహనాలు కాకుండా రోల్స్ రాయ్స్ సహా ఇతర ఏ లగ్జరీ వాహనాల్లో ప్రయాణించరు. ముఖేష్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండటంతో ఆయన ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో కూడిన సాయుధ వాహనాల్లోనే ప్రయాణిస్తారు. ఈ తరహా ఏర్పాట్లతో కూడిన బీఎండబ్ల్యూ వాహనం, రెండు మెర్సిడెస్ బెంజ్ వాహనాలను ఆయన వాడుతుంటారు. అందుకే ఆయన కాన్వాయ్ లో రెండు, మూడు లగ్జరీ వాహనాలు తప్పక అనుసరిస్తాయి.