Evergreen Bonus | కంపెనీలు తమ సిబ్బంది శ్రేయస్సు, సంక్షేమానికి పెద్దపీట వేస్తాయి. వాటిల్లో కొన్ని తమ సిబ్బంది జీవితంలో హాయిగా స్థిరపడేలా బహుమతులు ఇస్తుంటాయి. దాదాపు అన్ని కంపెనీలు బోనస్లు ఇస్తుంటాయి. ఆ బోనస్ ప్రతి ఉద్యోగి వేతనంలో కొంత శాతంగా నిర్ణయిస్తాయి. కానీ ఓ కంపెనీ ఏకంగా ఉద్యోగి 50 నుంచి 52 నెలల వేతనంతో సమానమైన బోనస్ అందచేసిందని సమాచారం. అవును ఇది నిజం. తైవాన్కు చెందిన ఎవర్గ్రీన్ మెరైన్ కంపెనీ తమ ఉద్యోగులకు సగటున నాలుగేండ్లకు పైగా వేతనంతో సమానమైన బోనస్ గత ఏడాది చివర్లో ఇచ్చినట్లు తెలుస్తున్నది.
తైవాన్ ఆధారిత కాంట్రాక్ట్లతో సంబంధం ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్లు వర్తింపజేస్తున్నది ఎవర్గ్రీన్ మెరైన్ కంపెనీ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉద్యోగి వెల్లడించారు. ప్రతి కంపెనీ ప్రతియేటా సంస్థ సాధించే లాభాలు, వ్యక్తిగతంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా బోనస్లు ఇస్తూ ఉంటుందని ఎవర్గ్రీన్ గతవారం మీడియా ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది.
కరోనా మహమ్మారి వేళ ప్రపంచవ్యాప్తంగా వస్తువుల సరఫరా నిలిచిపోయింది. కొవిడ్-19 ఉధృతి తగ్గిన తర్వాత గత రెండేండ్లుగా వినియోగ వస్తువులకు గిరాకీతోపాటు వాటి రవాణా చార్జీలు పెరిగిపోయాయి. దీనివల్ల ఎవర్గ్రీన్ కంపెనీ 2022 ఆదాయం 20.7 బిలియన్ డాలర్లు. ఇది 2020 సేల్స్తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ.
2021 ప్రారంభంలో సమస్యలు, ఇబ్బందుల వల్ల ఎవర్గ్రీన్పై మీడియాలో వార్తలు పతాక శీర్షికలకెక్కాయి. ఎవర్గ్రీన్ మెరైన్ నిర్వహిస్తున్న ఒక ఓడ.. సూయెజ్ కెనాల్లో చిక్కుబడి పోవడంతో ప్రపంచ దేశాల మధ్య వస్తువుల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. తాజాగా 52 నెలల వేతనం వరకు సిబ్బందికి బోనస్ ఇచ్చిందని తైపే ఎకనమిక్ డైలీ న్యూస్ గత వారం వార్త ప్రచురించింది.
ఎవర్గ్రీన్లో కొందరు ఉద్యోగులు 65 వేల డాలర్లకు పైగా బోనస్ గత నెల 30న అందుకున్నారని తైపై ఎకనమిక్ డైలీ వార్తా కథనం. దీని సమాచారం, పూర్తి వివరాలను మాత్రం బయటపెట్టలేదు. అలాగే ఎవర్గ్రీన్ మెరైన్ సిబ్బంది మొత్తానికి ఈ లక్కీ ఛాన్స్ లభించలేదని తెలుస్తున్నది. షాంఘై కేంద్రంగా పని చేస్తున్న సంస్థ సిబ్బంది.. యాజమాన్యం అనుచిత తీరుపై ఫిర్యాదు చేశారని సమాచారం. తమ వేతనం కంటే ఐదు నుంచి ఎనిమిది రెట్ల శాలరీ మాత్రమే బోనస్గా అందుకున్నామని ఎవర్గ్రీన్ షాంఘై సిబ్బంది చెప్పారంటూ సైక్సిన్ నివేదించింది.
ఇటీవలి బోనస్ చెల్లింపులు శుభ పరిణామమే అయినా.. భవిష్యత్లోనూ కొనసాగుతాయా? అన్న చర్చ సాగుతున్నది. అయితే, ఆర్థిక మాంద్యం ముప్పు నేపథ్యంలో ప్రపంచ వృద్ధిరేటు బలహీన పడుతుందని వార్తలొస్తున్నాయి. ఈ తరుణంలో ఈ ఏడాది లాభాలు తగ్గిపోతాయని షిప్పింగ్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. 2021లో 250 శాతానికి పైగా పుంజుకున్న ఎవర్గ్రీన్ మెరైన్ స్టాక్.. గతేడాది 54 శాతం పతనమైంది.