Stock Investment | ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు లాభాలు గడిస్తుండటంతో చాలా మంది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. యావత్ మానవాళిని వణికించిన కరోనా వేళ కొత్తగా లక్షల మంది `డీమ్యాట్` ఖాతాలు ఓపెన్ చేశారు. అయితే నష్టాల్లో చిక్కుకున్న వారు తమ పెట్టుబడులు విత్ డ్రా చేసుకున్నారు. అటువంటి వారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వివిధ సంస్థల స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ లుక్కేద్దామా..
అధిక రాబడితోపాటు రిస్క్ తో కూడిన నష్టం కూడా ఉంటుంది. ఇది సరిగ్గా స్టాక్ మార్కెట్లకు వర్తిస్తుంది. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ఎల్లవేళలా ఒకే విధంగా ఉండదు. కొన్నిసార్లు స్టాక్స్ పుంజుకుంటే, మరికొన్ని సార్లు పతనం అవుతుంటాయి.
దీర్ఘకాలిక దృష్టితో మార్కెట్లలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటూ కొనసాగుతున్న వారికి లాభాలు వచ్చి పడతాయని రుజువు అవుతున్నది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తగ్గిన మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. వివిధ సంస్థల స్టాక్స్ పతనమైనప్పుడు ఆయా స్టాక్స్ కొనుగోలు చేయడానికి సరైన టైం అని చెబుతున్నారు మార్కెట్లు విశ్లేషకులు.
ప్రతి ఇన్వెస్టర్ తన పెట్టుబడుల్లో స్టాక్ మార్కెట్లలో ఎంత శాతం మదుపు చేయాలన్న విషయమై గైడ్ లైన్స్, రూల్స్ ఉన్నాయి. మొత్తం నిధులు స్టాక్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్ల ఆధారిత పథకాల్లోనే మదుపు చేస్తే రిస్క్ ఎక్కువ. కనుక ప్రతి ఇన్వెస్టర్ తన ఆర్థిక లక్ష్యాలు, వయస్సు, రిస్క్ తదితర అంశాల ఆధారంగా పెట్టుబడులు పెట్టాలి.
మీ వయస్సును బట్టి ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతూ ఉండాలి.. ఉదాహరణకు 35 ఏండ్ల కుర్రాళ్లు.. తమ వద్ద ఉన్న నిధుల్లో 65 శాతం వరకూ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వయస్సు పెరుగుతున్నా కొద్దీ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ తగ్గిస్తూ ఉండాలి.
స్టాక్ మార్కెట్లలో దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా అంటే ఐదేండ్లకు పైగా గడువు పెట్టుకున్నప్పుడే స్టాక్స్ కొనుగోళ్లు చేపట్టాలి. ఆర్థిక లక్ష్యాలు.. రిటైర్మెంట్ ప్లాన్, పిల్లల ఉన్నత విద్యాకోర్సులకు దీర్ఘకాలిక గడువు ఉంటుంది. ఇటువంటి వాటికి స్టాక్స్లో పెట్టుబడులు ఉపయోగించుకోవచ్చు. ఒక ఏడాది నుంచి ఐదేండ్ల లోపు లక్ష్యాలకు డెట్ బేస్డ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిదన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఇన్వెస్ట్మెంట్స్ ఎల్లవేళలా విభిన్నంగా ఉండాలి. ఒకే రంగ కంపెనీలు, ఒకే తరహా ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. స్టాక్స్లో ఒడిదొడుకులను ప్రతినిత్యం గమనిస్తూ ఉండాలి. స్టాక్ మార్కెట్ల పట్ల సరైన అవగాహన లేనివారు ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. నిర్దిష్ట గడువులోపు నిరంతరం ఆయా పెట్టుబడులు.. వాటిపై లాభాలను సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లడం తప్పనిసరని చెబుతున్నారు.