Mutual Funds | ప్రభుత్వోద్యోగి అయినా, ప్రైవేట్ కంపెనీలో కార్మికుడైనా.. ఐటీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అయినా.. వ్యాపారి అయినా.. ప్రతి ఒక్కరికీ కుటుంబ అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలు ఉంటాయి. వాటి కోసం తమ ఆదాయంలో కొంత మొత్తం మదుపు చేస్తారు. చాలా మంది నష్ట భయం లేని ఫిక్స్డ్ డిపాజిట్లలో డిపాజిట్ చేస్తారు. రియల్ ఎస్టేట్, బంగారంపైనా పెట్టుబడి పెడతారు. స్టాక్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్ల ఆధారిత మ్యూచువల్ ఫండ్స్లోనూ పెట్టుబడులు పెడుతున్న వారూ ఉన్నారు.
అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ తేదీ ముగిసిన తర్వాత ఫిక్స్డ్ రిటర్న్స్ మాత్రమే వస్తాయి. రియాల్టీ రంగంలో ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలే వస్తాయి. బంగారంపై గతేడాది 19 శాతం రిటర్న్స్ వచ్చాయి. కానీ స్టాక్స్, వాటి ఆధారిత మ్యూచువల్ ఫండ్స్లతో నష్ట భయం ఎక్కువ. కానీ, రిటర్న్స్ మాత్రం బాగానే ఉంటాయి. మెరుగ్గా ఆదాయం సంపాదించే వారు వీటిని రెగ్యులర్ గ్రోత్ ఆప్షన్లుగా చేసుకోవచ్చు. స్టాక్స్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్), లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఫోకస్డ్ ఫండ్స్ తదితరాలు ఉన్నాయి.
ఇక ఈ ఏడాది ఈఎల్ఎస్ఎస్ తదితర ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ మదుపర్లకు 20-30 శాతం రిటర్న్స్ ఇచ్చిన పథకాలు కూడా ఉన్నాయి. దేశీయ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లోని 243 ఫండ్స్లో 15 మాత్రమే మదుపర్లకు 30 శాతానికి పైగా లాభాలందించాయి. వాటిల్లో మహీంద్రా మనులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్.. ఈ ఏడాది 39.34 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ 36.30, బంధన్ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ 35.08 శాతం లాభాలు తెచ్చి పెట్టాయి.
ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా 30 శాతానికి పైగా లాభాలు అందించిన ఫండ్స్ ఉన్నాయి. వాటిల్లో యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్ (34.04 %), నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ (34.01%),
హెచ్ఎస్బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ (33.98%), హెచ్డీఎఫ్సీ స్మాల్ క్యాప్ ఫండ్ (33.66%), జేఎం మిడ్ క్యాప్ ఫండ్ (32.68%), ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ (32.57%), జేవీ వాల్యూ ఫండ్ (31.53 %), సుందరం స్మాల్ క్యాప్ ఫండ్ (30.62%), మహీంద్రా మనులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ (30.26 %), బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ (30.16%), డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ (30.09%), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ (30.04 %) ఉన్నాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్న వారు.. వాటిలో నష్ట భయం, భవిష్యత్ లక్ష్యాలు, తమ ఆదాయ పరిమితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.