Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ప్రధాన నగరాల్లో కార్యాలయాల కోసం లీజుకు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, ముంబై, ఎన్సీఆర్ వంటి ఎనిమిది నగరాల్లో 2022లో ఏకంగా 51 మిలియన్ చదరపు అడుగులకు పైగా స్థలాన్ని లీజుకు తీసుకున్నారని ప్రముఖ కన్సల్టెన్సీ నైట్ఫ్రాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీటిలో ఆఫీస్ స్పేస్ లీజింగ్కు కేరాఫ్గా హైదరాబాద్ మారడమే కాకుండా.. ఆఫీస్ లీజ్ కోసం పోటీపడుతున్న నగరాలైన పుణె, బెంగళూరు సరసన హైదరాబాద్ నిలిచిందని తెలిపింది. దేశ, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ బాట పట్టడం, ప్రతిభ కలిగిన సిబ్బంది లభిస్తుండటం, లీజ్ చార్జీలు తక్కువగా ఉండటంతో గ్లోబల్ సంస్థలు ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి.
దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో ఆఫీస్ స్పేస్కు మంచి డిమాండ్ ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ముఖ్యంగా లక్ష చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని ఆఫీస్ స్థలానికి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ఉత్సాహం చూపాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పుణె నగరాలు ఈ ఒప్పందాలు జరిగే నగరాల్లో ముందు వరుసలో నిలిచాయని పేర్కొంది. పుణెతో సమానంగా హైదరాబాద్లో 53 శాతం వృద్ధిని సాధించాయి. 51 శాతం వృద్ధితో బెంగళూరు ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఆఫీస్ కేటగిరీలలో హైదరాబాద్లో 120 ఒప్పందాలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఇందులో 50వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కేటగిరీలో 83 ఒప్పందాలు జరుగగా.. 50 వేలు-లక్షల చదరపు అడుగుల కేటగిరీలో 22 ఒప్పందాలు, లక్ష చదరపు అడుగులకు పైగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో 15 ఒప్పందాలు జరిగినట్లు తెలిపింది. కోల్కతాలో 70 శాతం, చెన్నైలో 57 శాతం ఆఫీస్ స్పేస్ లావాదేవీలు నమోదుకాగా..ఇవన్నీ 50వేల చదరపు అడుగుల విస్తీర్ణం లోపువే కావడం గమనార్హం. ఐటీ ఆధారిత కంపెనీలు తీసుకుంటున్న మొత్తం ఆఫీసు లీజులో యాభై శాతం కంటే ఎక్కువగా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం గలవే ఉంటున్నాయని, 2022లో ఎనిమిది నగరాల్లో కలిపి 51 మిలియన్ చదరపు అడుగులకు పైగా ఆఫీస్ లీజుకు తీసుకోవడం చారిత్రాత్మకమని నైట్ ఫ్రాంక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ తెలిపారు.