హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా మరిన్ని చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ(టీఎస్-రెడో) చైర్మన్ వై సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 138 ఈవీ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, త్వరలో హైదరాబాద్లో 118, వరంగల్లో 10, కరీంనగర్లో 10 ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల స్థలాల్లో రెవెన్యూ షేరింగ్, పీపీపీ విధానంలో ఈ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అనువైన స్థలాల జాబితాను ఇప్పటికే హెచ్ఎండీఏ, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, టూరిజం, పౌరసరఫరాల శాఖ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రోడ్డు, రవాణా శాఖలు రెడ్కోకు అందజేశాయి. మొత్తంగా 979 ప్రాంతా లు అనువైనవిగా గుర్తించారు. మరోవైపు ఎలక్ట్రిక్ టూవీలర్లకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు రెడ్కో.. టీఎస్ఈవీ పేరుతో వెబ్, మొబైల్ యాప్ను రూపొందిస్తున్నదని, వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానున్నట్లు ఆయన వివరించారు.
పాత డీజిల్ ఆటోలు.. బస్సుల్లో మార్పులు
పాత డీజిల్ ఆటోలు, బస్సుల్లో మార్పులు చేసి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కార్పొరేషన్ చైర్మన్ సతీష్రెడ్డి చెప్పారు. అలాగే ఆర్టీసీ డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రజల్లో ఈవీలపై మరింత అవగాహన కల్పించేందుకు మరోసారి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న, ఈ ఏడాది డిసెంబర్లో మూడో విడత ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు సతీష్ రెడ్డి తెలిపారు.