న్యూఢిల్లీ, మే 1: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఐఏ), డిజిటలైజేషన్ తదితర నవ టెక్నాలజీల కారణంగా వచ్చే ఐదేండ్లలో ప్రపంచవ్యాప్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు అదృశ్యమైపోతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) హెచ్చరించింది. ప్రపంచ జాబ్ మార్కెట్లో 23 శాతం మార్పు జరుగుతుందని, తద్వారా కొన్ని కొత్త ఉద్యోగాల కల్పన, పాత ఉద్యోగాలు అంతరించిపోతాయన్నది. 2027కల్లా 6.9 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని, 67.3 కోట్ల ప్రస్తుత ఉద్యోగాల్లో 8.3 కోట్ల ఉద్యోగాలు వచ్చే ఐదేండ్లలో ఉండబోవని తెలిపింది. అంటే నికరంగా 1.4 కోట్ల ఉద్యోగాలకు (మొత్తం ఉద్యోగాల్లో 2 శాతం) ఉనికి లేనట్టే. ఏఐ వంటి టెక్నాలజీలు పెరుగుతున్నందున క్లరికల్ వర్క్ తగ్గిపోతుందని, టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులకు డిమాండ్ జోరందుకుంటున్నదని..ఈ నేపథ్యంలో ప్రపంచ జాబ్ మార్కెట్లో కొత్త సంక్షోభం తలెత్తవచ్చని డబ్ల్యూఈఎఫ్ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 803 కంపెనీలతో సర్వే నిర్వహించి ఈ అంచనాల్ని రూపొందించినట్టు ఫోరం తెలిపింది.
ఆటోమేషన్ కారణంగా బ్యాంక్ టెల్లర్స్, క్యాషియర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి క్లరికల్ ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతాయని, ఏఐ మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నదని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. అలాగే సరఫరా చైన్స్ స్థానికీకరణ, గ్రీనర్ ఎకానమీలు ప్రధానంగా కొత్త ఉద్యోగాల్ని కల్పిస్తాయన్నది. డిజిటల్ యాక్సెస్ పెరగడం, టెక్నాలజీని కంపెనీలు అందిపుచ్చుకోవడం కూడా కొత్త ఉద్యోగ కల్పనకు కారణం అవుతుందన్నది. అయితే నెమ్మదిస్తున్న ఆర్థికాభివృద్ధి, సరఫరా కొరతలు, ద్రవ్యోల్బణం కారణంగా తక్షణ ఉపాధి నష్టాలు ఉంటాయని డబ్ల్యూఈఎఫ్ హెచ్చరించింది.
కొత్త, పాత ఉద్యోగాల మార్పు భారత్లో 22 శాతం మేర ఉంటుందని ఫోరం అంచనా వేసింది. ఈసీజీ (ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్) ప్రమాణాలు ఉద్యోగాలను పెంచుతాయని ఇండియాలో 61 శాతం కంపెనీలు భావిస్తుండగా, కొత్త టెక్నాలజీలతో ఉద్యోగ కల్పన జరుగుతుందని 59 శాతం కంపెనీలు, డిజిటల్ యాక్సెస్ విస్త్రతంకావడం ద్వారా ఉపాధి పెరుగుతుందని 55 శాతం కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్టులు, డాటా అనలిస్టులు, సైంటిస్టులకు డిమాండ్ ఉంటుందని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి.
దేశవ్యాప్తంగా వైట్-కాలర్ ఉద్యోగాలకు డిమాండ్ అంతకంతకు పడిపోతున్నది. గతనెలలో 5 శాతం డిమాండ్ పడిపోయి 2,715 నియామకాలకు తగ్గినట్టు నౌకరీ.కామ్ తాజాగా వెల్లడించింది. ఐటీ రంగ సంస్థలు నియామకాలకు చెక్ పెట్టడం ఇందుకు కారణమని విశ్లేషించింది. ఏప్రిల్ 2022లో 2,863 నియామకాలు జరిగాయని నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ వెల్లడించింది. ఐటీ రంగంలో నియామకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ..రియల్ ఎస్టేట్, బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా) రంగాల్లో రిక్రూట్మెంట్లు జోరందుకున్నాయని తెలిపింది. నగరాల వారీగా చూస్తే కోల్కతాలో రిక్రూట్మెంట్లలో 28 శాతం పెరుగదల కనిపించగా..పుణెలో 22 శాతం, హైదరాబాద్లో 19 శాతం చొప్పున అధికమయ్యాయి. 16 ఏండ్ల కంటే అధిక అనుభవం కలిగిన సీనియర్ ఉద్యోగులకు డిమాండ్ అధికంగా ఉన్నదని నివేదిక వెల్లడించింది. రంగాలవారీగా చూస్తే రియల్ ఎస్టేట్ రంగంలో అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు లభించగా..ఆ తర్వాతి స్థానంలో చమురు అండ్ గ్యాస్, బీమా, బ్యాంకింగ్, వాహన, ఫార్మాస్యూటికల్స్ రంగాలు ఉన్నాయి.