ముంబై, డిసెంబర్ 13: రిజర్వ్బ్యాంక్ ఎంతగా డాలర్లు విరజిమ్మినా రూపాయి తిరిగి శరవేగంగా పతనమవుతున్నది. గత నెలలో 81 స్థాయివరకూ రికవరీ అవుతున్నట్టు కన్పించిన భారత కరెన్సీ మళ్లీ ఆల్టైమ్ కనిష్ఠస్థాయికి చేరువ అవుతున్నది. మంగళవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ హఠాత్తుగా ఇంట్రాడేలో 39 పైసలు క్షీణించి 82.90 కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
చివరకు 82.60 వద్ద ముగిసింది. ఈ డిసెంబర్ నెలలో ఇప్పటివరకూ 137 పైసలు నష్టపోయింది. అక్టోబర్ నెలలో ఇది 83.20 వద్ద చరిత్రాత్మక కనిష్ఠస్థాయిని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రూపాయి పతనాన్ని నిలువరించడానికి రిజర్వ్బ్యాంక్ 2022 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూపాయి ఒడిదుడుకుల్ని నివారించడానికి ఆర్బీఐ 33.42 కోట్ల డాలర్లను విక్రయించిందని స్వయానా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో ప్రకటించిన నేపథ్యంలో కరెన్సీ పడిపోవడం గమనార్హం.
డాలరు బలహీనపడినా..
అమెరికా కరెన్సీ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ 115 నుంచి 105 మేరకు 9.5 శాతం తగ్గినప్పటికీ, రూపాయి మాత్రం బలపడకపోగా, క్షీణబాట పడుతున్నది. ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్లో అమ్మకాలు జరపడం, వడ్డీ రేట్లపై డిసెంబర్ 14న అమెరికా కేంద్ర ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో భారత కరెన్సీపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు.