న్యూఢిల్లీ, మే 12: అదానీ గ్రూప్ అవకతవకలపై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ దర్యాప్తును పూర్తిచేసేందుకు మరో మూడు నెలల గడువు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు సూచనాప్రాయంగా తెలిపింది. అదానీ గ్రూప్ స్టాక్ ధరల్ని కృత్రిమంగా పెంచి మోసాలకు పాల్పడినట్టు హిండెన్బర్గ్ తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్) స్వీకరించిన సుప్రీం కోర్టు దర్యాప్తు చేసి రెండు నెలల్లో వివరాలు సమర్పించాలంటూ మార్చి 2న సెబీని ఆదేశించింది.
తాజా విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేపీ పార్దివాలాలతో కూడిన బెంచ్కు దర్యాప్తుకు మరో ఆరు నెలలు గడువు ఇవ్వాలంటూ సెబీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విన్నవించారు. ‘గడువు పెంచుతాం. కానీ ఆరు నెలలు కాదు, మూడు నెలలు ఇస్తాం’ అంటూ బెంచ్ స్పష్టంచేసింది. కంపెనీల లాభనష్టాలు, ఆస్తిఅప్పుల్ని తప్పుగా చూపించడం, స్టాక్ లావాదేవీల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరిపేందుకు సాధారణంగా 15 నెలల సమయం పడుతుందని, కానీ అదానీ-హిండెన్బర్గ్ కేసు విషయంలో ఆరు నెలల్లో పూర్తిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నామంటూ సెబీ సుప్రీం కోర్టుకు విన్నవించింది.
అదానీ-హిండెన్బర్గ్ ఉదంతంపై దాఖలైన పలు పిల్స్ను, సెబీ వినతిపై తిరిగి మే 15న సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ వివాదంపై తాము నియమించిన జస్టిస్ (రిటైర్డ్) ఏపీ సాప్రే కమిటీ నివేదిక కోర్టు రిజిస్ట్రీకి అందిందని, ఈ కమిటీ సమర్పించిన వివరాల్ని పరిశీలించిన మీదట తిరిగి సోమవారం విచారణ జరపనున్నట్టు సుప్రీం బెంచ్ తెలిపింది. ఈ విషయంలో రెగ్యులేటర్ విఫలమైనట్టు కోర్టు చెప్పలేదని, ఆరోపణలు చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని పిటిషనర్ జయా ఠాకూర్ తరపు న్యాయవాదిని బెంచ్ హెచ్చరించింది. ‘అవి మీరు చేసిన ఆరోపణలే. జాగ్రత్తగా లేకపోతే స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటుంది. మీ ఆరోపణల నిగ్గుతేల్చడానికే మేము కమిటీని నియమించాం’ అని బెంచ్ వ్యాఖ్యానించింది.