Stocks Loss | దేశీయ స్టాక్ మార్కెట్లలో గత ఆరు సెషన్లలో గడించిన లాభాలు సోమవారం తుడిచిపెట్టుకుపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 306.01 (0.55 శాతం) నష్టపోయి 55,766.22 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన ఎస్ఈ ) సూచీ నిఫ్టీ 88.45 పాయింట్ల పతనంతో 16,631 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆటో, ఫార్మా షేర్లు భారీగా ఒక శాతం నష్టపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) వాటాలు, రియాల్టీ ఇండెక్స్లు 0.50 శాతానికి పైగా నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్ మాత్రం 1.46 శాతం లాభ పడింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రెండు వారాల గరిష్టానికి దూసుకెళ్లింది. శుక్రవారం ముగిసిన రూ.79.85 నుంచి 12 పైసలు లాభ పడి సోమవారం రూ.79.73 వద్ద ముగిసింది.
అమెరికా స్టాక్ మార్కెట్లలో నష్టం చవి చూసిన తర్వాత స్టాక్ ఫ్యూచర్స్ బలహీన పడ్డాయి. డోజోన్స్ 137.61 పాయింట్ల నష్టంతో 31,899.29 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 0.93 శాతం నష్టపోయి 3,961.63 పాయింట్ల వద్ద ముగిసింది. నాస్డాక్ కూడా 1.87 శాతం పతనంతో 11,834 పాయింట్ల వద్ద నిలిచిపోయింది. అధిక ధరలతోపాటు కీలక వడ్డీరేట్ల పెంపుతో ఆర్థిక మాంద్యం ముప్పు కొనసాగడం కూడా ఒక కారణమే.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఈనెల 22న రూ.1473.83 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు. మరోవైపు భారత విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 20 నెలల కనిష్టస్థాయికి పడిపోయాయి. ఈ నెల 15న ముగిసిన వారంతో భారత్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 7.54 బిలియన్ల డాలర్ల కనిష్ఠ స్థాయికి పతనం అయ్యాయి. ఇది అతి కనిష్టం. ఇంతకుముందు 2020 నవంబర్ ఆరో తేదీన కనిష్ఠ స్థాయికి విదేశీ మారకం నిల్వలు పడిపోయాయి.