బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతున్నా, అమెరికా ఫెడ్ పావు శాతం రేట్ల పెంచడంతో పాటు ఈ ఏడాది మరో పెంపు ఉంటుందన్న సంకేతాలివ్వడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 155 పాయింట్ల నష్టంతో 16,945 పాయింట్ల వద్ద ముగిసింది. 4 రోజుల ట్రేడింగ్కే పరిమితమైన ఈ వారంలో మార్చి డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్నందున, భారీ షార్ట్ కవరింగ్తో సూచీలు పెరుగుతాయన్న అంచనాల్ని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో షార్ట్ పొజిషన్లను భారీగా పెంచుకున్నారని జేఎం ఫైనాన్షియల్ డైరెక్టర్ రాహుల్ శర్మ, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్లు తెలిపారు. దీంతో వచ్చే మూడు రోజుల్లో షార్ట్ కవరింగ్ జరగవచ్చని వారు అంచనా వేశారు.
17,000పైన స్థిరపడితే ర్యాలీ
కొద్ది రోజులుగా 16,800-16,850 శ్రేణి మధ్య కొనుగోలు మద్దతు లభిస్తున్నందున, ఈ వారం ఆ శ్రేణిని కోల్పోకుండా, 17,000పైన స్థిరపడితే ర్యాలీ జరుగుతుందని సంజీవ్ తెలిపారు. నిఫ్టీ 17,210 స్థాయిని అధిగమిస్తే వెనువెంటనే 17,300కు చేరే అవకాశం ఉందని, అటుపై 17,500-17,600 వరకూ పెరగవచ్చని రాహుల్ శర్మ అంచనా వేశారు.