హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారుతున్న టీ-హబ్లో సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వెబ్ 3.0లో దిగ్గజ పెట్టుబడిదారు అయిన కాయిన్బేస్ ఇంక్ సహకారం తీసుకోనున్నది. ఈ మేరకు శనివారం కాయిన్బేస్ ఇంక్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకొన్నది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగ డైరెక్టర్ రమాదేవి లంక సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. కాయిన్బేస్ ఇంక్ అనేది వెబ్ 3.0లో ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారుల్లో ఒకటి. ప్రస్తుతం వెబ్ 3.0లో భాగమైన బ్లాక్ చెయిన్, డాప్స్, టోకెన్ వంటి టెక్నాలజీల ఆధారితంగా పని చేసేందుకు స్టార్టప్ వ్యవస్థాపకులు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. అందుకే టీ-హబ్ ద్వారా వెబ్ 3.0 సాంకేతికతలో కాయిన్బేస్ ఇంక్ సహకారాన్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఒప్పందంలో భాగంగా కాయిన్బేస్ సంస్థ తెలంగాణకు చెందిన వెబ్ 3.0 వ్యవస్థాపకులకు సామర్థ్య పెంపు, మెంటార్షిప్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సాంకేతిక సహకారం అందించనున్నది. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేసే 3.0 సంబంధిత కార్యక్రమాలకు కాయిన్బేస్ సాంకేతిక సలహాదారుగా వ్యవహరించనున్నది. ఒప్పందం సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ మాట్లాడుతూ.. ఈ ఎంవోయూతో దేశంలో వెబ్ 3.0 టెక్నాలజీకి కేంద్రంగా హైదరాబాద్ అవతరిస్తుందని అన్నారు. కాయిన్బేస్ సాంకేతిక సహకారంతో మరింత శక్తిమంతమైన, మెరుగైన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రం నుంచి వినూత్న ఆవిష్కరణలు, ఉత్పత్తులు వస్తాయని తెలిపారు. కాయిన్బేస్ డైరెక్టర్ కేటీ మిచెల్ మాట్లాడుతూ.. భారతదేశంలో వినూత్న సాంకేతికతకు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా ఉన్నదని కొనియాడారు.