ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పెంచుతూపోతున్నది. గత ఏడాది మే నెల నుంచి ఇప్పటిదాకా 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లు.. తదనుగుణంగా డిపాజిట్లపైనా వడ్డీరేట్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై సరైన వ్యూహంతో ముందుకెళ్తే మరింత రాబడి అందుకోవచ్చు.
వివిధ కాలపరిమితులు, రకరకాల మొత్తాలతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం వల్ల విస్తృత ప్రయోజనాలను పొందవచ్చు. దీనివల్ల వడ్డీరేట్లు పెరిగినా.. తగ్గినా.. మనకొచ్చే సంపదలో పెద్దగా మార్పులేవీ ఉండబోవని, స్థిరమైన ఆదాయమే వస్తుందని నిపుణులు చెప్తున్నారు. పైగా మన ఆర్థిక అవసరాలకు సరిపడా మొత్తాలను మెచ్యూరిటీ సమయంలో అందుకోవచ్చని అంటున్నారు. ఉదాహరణకు రూ.10 లక్షలతో ఒక్కటే ఐదేండ్ల ఎఫ్డీ తీసుకోవడం కంటే.. రూ.2 లక్షల చొప్పున ఏడాది నుంచి ఐదేండ్ల కాలపరిమితిగల ఐదు ఎఫ్డీల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని వివరిస్తున్నారు.
రకరకాల టెన్యూర్స్లో ఎఫ్డీ తీసుకోవడం వల్ల మెచ్యూరిటీ కోసం ఎక్కువ కాలం ఆగాల్సిన పనిలేదు. అలాగే ఏటేటా దఫదఫాలుగా నగదు మన చేతికి వస్తుంది. ఇక అత్యవసరమైతే ఏదో ఒక ఎఫ్డీని మధ్యలోనే తీసుకోవచ్చు. ఫలితంగా జరిమానాలూ తక్కువగానే ఉంటాయి. అలాగే స్వల్పకాలిక క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం ఎఫ్డీలు అనువైనవి. అంతేగాక సీనియర్ సిటిజన్లకూ సురక్షిత పెట్టుబడి సాధనాలు.