ఈ ఏడాది 9 శాతానికి పెరగొచ్చు: క్రిసిల్
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో రిజర్వు బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం పలు చర్యల్ని తీసుకున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా బ్యాంకులపై మొండి బకాయిల భారం అధికంగానే ఉండనుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ మంగళవారం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 8-9 శాతానికి పెరుగుతాయని అంచనా. అయినా 2018లో నమోదైన 11.2 శాతంకంటే ప్రస్తుత సంవత్సరం తక్కువేనని రేటింగ్ సంస్థ తెలిపింది. కరోనా కారణంగా దెబ్బతిన్న వర్గాలకు ఊరటకల్పించేందుకు ఇటీవల అమలుచేసిన రుణ పునర్వ్యవస్థీకరణ, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) వంటి చర్యలు… ఎన్పీఏల పెరుగుదలను కొంతవరకూ కట్టడిచేశాయని, అయినా మొండిబకాయిలు ఎక్కువగానే పెరుగుతాయని క్రిసిల్ వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి బ్యాంకులు వాటి మొత్తం రుణాల్లో 2 శాతం వరకూ పునర్వ్యవస్థీకరించవచ్చని, ఎన్పీఏలు, పునర్వ్యవస్థీకరించబడిన రుణాలు కలిపితే 10-11 శాతానికి చేరుతుందని రిపోర్ట్లో అంచనా వేశారు.
రిటైల్, ఎంఎస్ఎంఈల్లో మొండి రుణాలెక్కువ
మొత్తం బ్యాంకుల రుణంలో 40 శాతం వాటా కలిగిన రిటైల్, ఎంఎస్ఎంఈ విభాగాల్లో ఎన్పీఏలు అధికంగా పెరగవచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. రిటైల్ రుణాల్లో మొండి బకాయిలు 4-5 శాతం, ఎంఎస్ఎంఈల్లో 17-18 శాతం మేర పెరగవచ్చన్నారు. కార్పొరేట్ రుణాల్లో చాలావరకు మొండి బాకీల గుర్తింపు ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం ఈ రంగం నుంచి తాజా ఎన్పీఏలు తక్కువగానే ఉండొచ్చన్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) కార్యకలాపాల్ని ప్రారంభించనున్న నేపథ్యంలో, ఆ సంస్థకు బ్యాంకులు రూ.90,000 కోట్ల ఎన్పీఏల్ని విక్రయిస్తాయని క్రిసిల్ వివరించింది. ఈ చర్యతో బ్యాంకుల పుస్తకాల్లో మొత్తం ఎన్పీఏలు తగ్గుతాయని పేర్కొంది.